YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కౌంటింగ్ టైం... గొడవలు జరిగే అవకాశం

కౌంటింగ్ టైం... గొడవలు జరిగే అవకాశం

విజయవాడ, మే 20
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ , పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అప్రమత్తం చేసింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటతో సహా పలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించింది. కాగా, జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. సీసీ కెమెరాలతో భద్రతా సిబ్బంది నిరంతరం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఆ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు.. పోలీసులకు కీలక సూచనలు ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరికి నేర చరిత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అవి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు, రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ రోజు, అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సోమవారం డీజీపీకి విచారణ బృందం అందించనుంది. అలాగే, సీఎస్ కు కూడా నివేదిక అందించనుండగా.. ఆయన ద్వారా సీఈవో, సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అయితే, పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉందని సమాచారం. గత రెండు రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ సభ్యులు.. నేతలు, స్థానికులు, పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఆయా ఘటనా స్థలాలను పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. అటు, ప్రాథమిక విచారణ పూర్తైన క్రమంలో.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఈ కేసుల విచారణపై ఇక ముందు కూడా పర్యవేక్షణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు. మరోవైపు, పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం
కొత్త నియామాకాలు
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఈసీ పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు డీఎస్పీలతో పాటు ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలను కొత్తగా నియమించింది. నరసరావుపేట  డీఎస్పీగా ఎం.సుధాకర్, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవిమనోహర్ చారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా ఎం.వెంకటాద్రి, తాడిపత్రి డీఎస్పీగా జనార్ధన్ నాయుడులకు ఈసీ పోస్టింగ్ ఇచ్చింది. అలాగే, పల్నాడు ఎస్బీ సీఐగా బి.సురేష్ బాబు, పల్నాడు ఎస్బీ సీఐ 2గా యూ.శోభన్ బాబు, తిరుపతి ఎస్బీ సీఐగా విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా ఎం.రామారావు, తాడిపత్రి సీఐగా పి.నాగేంద్ర ప్రసాద్ లను నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఎన్నికల సమయంలో అల్లర్ల కట్టడిలో విఫలం అయ్యారంటూ పలువురు పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది.ఏపీలోని 3 కొత్త జిల్లాలకు సైతం ఎన్నికల సంఘం ఇటీవలే (మే 18న) కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్,  తిరుపతి జిల్లా ఎస్పీగా, హర్షవర్దన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు. పోలింగ్, అనంతరం ఈ జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో అక్కడున్న ఎస్పీలపై చర్యలు తీసుకుంది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీని నియమించింది.

Related Posts