YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కఠిన వైఖరి దిశగా ఏపీ పోలీస్

కఠిన వైఖరి దిశగా ఏపీ పోలీస్

విజయవాడ, మే  22
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఓవైపు జరిగిన సంఘటనలపై విచారణ చేపడుతూనే మరోవైపు ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అలర్ట్‌ అయ్యింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ నుంచి వచ్చిన హెచ్చరికలతో నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఎన్నికల వేళ జరిగిన హింసను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. పలువురు అధికారులపై చర్యలు చేపట్టింది. కొందరిని సస్పెండ్ చేయగా..మరి కొందరిని బదిలీ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. అందులోభాగంగానే సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించింది ఈసీ. ఏపీలో ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకూ డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్‌స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ సీఈవో నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సి.హెచ్‌. శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్‌నాయుడు, తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌కు ఎం. వెంకటాద్రిని నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు వెలువరించింది.ఇదిలా ఉంటే మరోవైపు ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఈసీ పలు ఆదేశాలను జారీ చేసింది. వీటిలో పెట్రోల్‌ను బాటిల్స్‌లో విక్రయించకూడదని. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా బాటిల్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తున్న విజయవాడలోని పలు పెట్రోల్‌ బంకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో బంకుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు… యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.మరోవైపు పల్నాడు జిల్లాలో ఈసీ రూల్స్‌ని పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు పక్కాగా పాటిస్తున్నాయి. లూజ్‌ ఆయిల్‌ దొరకదంటూ బంకుల బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలను గౌరవిస్తూ పెట్రోల్‌ బంక్‌ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసీ లూజ్‌ ఆయిల్‌ విక్రయించొద్దంటూ ఆదేశించింది. ఇక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విక్రయాలు జరుపుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
భారీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌటింగ్ చేపట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ను ఎన్నికల అధికారులు పరిశీలించారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. భద్రత విషయంలో పోలీసులకు సూచనలు చేశారు.చెదురు ఘటనలు మినహా ఏపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర కట్టుదిట్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదటి సర్కిల్‌కి సీఏపీఎఫ్‌ గార్డులు.. రెండో సర్కిల్‌కి పోలీసు బృందం, మూడో సర్కిల్‌ భద్రత కోసం జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందిన గార్డులు మోహరించారు. ప్రత్యేక బలగాలు 24 గంటటూ విధుల్లోనే ఉండడంతోపాటు సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌ని పర్యవేక్షిస్తారు అధికారులు.ఇక.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు మరింత పటిష్టభద్రత కల్పించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు, విశాఖ లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను ఆంధ్రా యూనివర్సిటీకి తరలించి.. స్ట్రాంగ్ రూమ్‌లకు తాళం వేశారు. పోలీసు బలగాల పహారాలో భద్రపరచారు. స్ట్రాంగ్‌ రూమ్స్ దగ్గర సీసీ కెమెరాల నిరంతర నిఘాతోపాటు.. కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీకి రెండు కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌గా ప్రకటించారు విశాఖ పోలీస్ కమిషనర్. అంతే కాకుండా స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో డ్రోన్‌లు, బెలూన్లు ఎగరేయకుండా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. పోలీస్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ హెచ్చరించారు.

Related Posts