హైదరాబాద్
తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం పై కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను ఇష్టానుసారంగా తుంగలో తొక్కినయ్. జనరల్ కేటగిరీని నాన్ లోకల్ పేరుతో తెలంగాణ యువతకు ఎంతో అన్యాయం చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ దాకా 95 శాతం ఉద్యోగాలను స్థానికులే ఇచ్చిన రాష్ట్రమేదైనా ఉందా? కాంగ్రెస్, బీజేపీ లకు నేను సవాల్ చేస్తున్నా. దీనిపై సమాధానం చెప్పాలె. ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెచ్చి తెలంగాణలో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దే. 95 శాతం స్థానిక రిజర్వేషన్లు దేశంలో మన దగ్గర మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లితండ్రులు, నిరుద్యోగులు అంతా ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మొత్తం రాష్ట్రంలో పదేళ్లలో వారు భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 24,086 మాత్రమే.
అందులో 42 శాతం తెలంగాణను అనుకుంటే మనకు వచ్చింది 10 వేలు మాత్రమే. ఏడాదికి వెయ్యి ఉద్యోగాలే. కేసీఆర్ ఉద్యోగాలే ఇవ్వలేదంటూ కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్లు అర్థం చేసుకోవాలె. టీఎస్పీఎస్సీ ద్వారా 60, 918 ఉద్యోగాలకు అనుమతులిస్తే...54, 015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. 35,250 ఉద్యోగాలు భర్తీ చేశాం.18, 765 ఉద్యోగాలు ప్రక్రియలో ఉన్నాయి. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతులిస్తే... 48, 247 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 47,068 ఉద్యోగాలు భర్తీ చేశాం. 1179 భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 17,631 పోస్టులకు అనుమతులిస్తే... 12, 904 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 3,694 భర్తీ చేశాం. 9210 భర్తీ దశలో ఉన్నాయి.
డీఎస్సీ ద్వారా 34,100 పోస్టులకు అనుమతులిస్తే... 28,534 పోస్టులకు అనుమతులిచ్చాం. 22, 892 పోస్టులు భర్తీ చేశాం. 5,642 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతులిస్తే... 9,684 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2,047 భర్తీ చేశాం. 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు పెట్టాం. కానీ బిల్లును గవర్నర్ గారు అడ్డుకున్నారు. లేదంటే 105 పోస్టులు భర్తీ అయ్యేవి. ఇతర సంస్థలన్నీ కలుపుకుంటే 54,846 ఉద్యోగాలు. అందులో49,341 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. భర్తీ చేసివవి 49,132. భర్తీ దశలో 219 ఉద్యోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి...30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఊదరగొడుతున్నాడు. వాళ్ల కాంగ్రెస్ నాయకులు కూడా అవే అబద్దాలను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు రాత పరీక్ష జరిపారో తారీఖులు చెప్పాలె. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. రేవంత్ రెడ్డి దుర్మార్గాలను బట్టబయటలు చేసే వివరాలను నేను చెబుతాను. మేం పరిపాలన అనుమతులు ఇచ్చిన ఉద్యోగాలు 2,32,000 ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం ఏడాదికి 19 వేల ఉద్యోగాలు ఇచ్చారు. స్థానిక యువతకే 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా రిజర్వేషన్ తీసుకొచ్చి...ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ చేశారు. కాంగ్రెస్ కన్నా 19 రెట్లు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మేము ఈ విషయాలను చెప్పుకోలేకపోయాం. కొత్త రాష్ట్రమైనప్పటికీ...పెట్టుబడులు తరలిపోతాయని అనుమానాలు ఉన్నప్పటికీ ఎన్నో సంస్థలను తీసుకొచ్చాం. టీఎస్ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. పరిశ్రమలు రావటం కారణంగా ప్రైవేట్ సెక్టార్ లో 24 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయి. గవర్నమెంట్ సెక్టార్ లో 2 లక్షల 36 వేల ఉద్యోగాలు. ప్రైవేట్ సెక్టార్ 24 లక్షల ఉద్యోగాలు. పదేళ్లలో మొత్తం 26 లక్షల 30 వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంతకంటే ఎక్కువ రిక్రూట్ మెంట్ చేసిన గవర్నమెంట్ పదేళ్లలో ఏదైనా ఉందా? మా కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లు చూపిస్తే తెల్లారే సరికి నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
దీని మీద ఆరు నెలలుగా సవాల్ చేస్తున్న సరే కాంగ్రెస్, బీజేపీ వాళ్ల నుంచి సమాధానం లేదు. కేవలం సొల్లు పురాణం చెబుతున్నారు. తెలంగాణ యువత నెత్తినిండా అబద్దాలను సోషల్ మీడియా ద్వారా నింపి పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చాక చేస్తున్న మోసాలను చూస్తుంటే బాధనిపిస్తోంది. ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? మేము ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి...దానికి 60 పోస్టులు కలిసి నోటిఫికేషన్ ఇచ్చాడు. డీఎస్సీ ద్వారా మేము 28 వేల ఉద్యోగాలు వేస్తే రేవంత్ రెడ్డి అప్పుడు లొల్లి పెట్టిండు. మేము డీఎస్సీ ద్వారా 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే..దాన్ని రద్దు చేశాడు. దానికి మరో 5 వేల ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ అంటూ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇయ్యలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని అతీగతి లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు నిండు అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చారు. స్వయంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నోటి నుంచి నిరుద్యోగ భృతి అనే మాట చెప్పించారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫ్రీ అన్నారు. అప్పుడు టెట్ ఫీజు రూ. 4 వందలు ఉంటేనే లొల్లి చేశారు. ఇప్పుడు రూ. 2 వేలు చేశారు. కష్టపడి ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలు తెస్తే వాటికి కూడా ఈ సీఎం పాతర వేస్తుంటే బాధనిపిస్తోంది. ఫార్మా సిటీ ఏర్పాటు చేసి 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేస్తే దాన్ని రద్దు చేశాడు. దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తాడంట. పరిశ్రమలు రాకుండా ఎక్కడి నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ ఉంటుంది. భట్టి ట్యాక్స్, రేవంత్ ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ ఇలా రాష్ట్రంలో బ్రూ (BRU) ట్యాక్స్ మొదలైంది. ఎవరి దుకాణం వాళ్లదే. బిల్డర్ల మీద కూడా ట్యాక్స్ వేస్తూ వారి నుంచి కూడా దోచుకుంటున్నారు. రక్తం రుచి మరిగిన పులులు వీళ్లు. పదేళ్లు అధికారంలో లేరు. ఇప్పుడు అందిన కాడికి దోచుకుంటున్నారు. త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడంట. మేము అర్థం చేసుకోగలం. మీరు సామంత రాజులు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ట్యాక్స్ వస్తూలు చేస్తున్నారు. కేన్స్ టెక్నాలజీస్ అనే సంస్థను నేనే పట్టుబట్టి ఇక్కడికి రప్పించాను. వాళ్లకు భూమి కూడా కేటాయించాం. 3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లు సిద్ధమయ్యారు. దాదాపు 15 వేల ఉద్యోగాలు వచ్చేవి. వీళ్లు వచ్చాక ఏమని బ్లాక్ మెయిల్ చేశారో...ఏం అన్నారో వాళ్లు వెళ్లిపోయారు. కార్నింగ్ అనే సంస్థను ఒప్పించి వెయ్యికోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించాం. ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్లు కూడా గుజరాత్ వెళ్లిపోయారు. మధ్య శ్రేణి నగరాలలకు కూడా మేము ఐటీ సంస్థలను తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు వరంగల్ నుంచి టెక్ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. పదేళ్లలో ఏటీ రంగంలో ఎంత అభివృద్ధి చేశామో నాస్ కామ్ లెక్కలే చెబుతాయి. 2014 లో మా ప్రభుత్వం 53 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2023 డిసెంబర్ నాటికి 2 లక్షల 40 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు చేరాయి. 2023 మే నాటికే ఐటీ 3 లక్షల 50 వేల ఐటీ ఉద్యోగాలుంటే 2023 మే నాటికి 9 లక్షల 8 వందల ఉద్యోగుల వచ్చాయి. ఈ వివరాలన్ని మీరు అర్థం చేసుకొని పది మందికి చెబితినే అందరికీ అర్థమవుతుంది.ఒక ఎదుగుతున్న రాష్ట్రానికి మేలు చేయాలి. అంతేకానీ నష్టం చేయకూడదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఏది పడితే అది చెబుతాం, చేస్తామంటే తెలంగాణ నష్టపోతుందని అన్నారు.
ఈ వాస్తవాలన్నీ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని ఈ వివరాలు చెబుతున్నా. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మీ తరఫున అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. బీఆర్ఎస్ అభ్యర్థి చదవుకున్న, గోల్ మెడలిస్ట్. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదు. కేఏపాల్ ను అవమానించొద్దు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మూర్ఖుడు
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కాదు. జోకర్ గా మారిపోయారు. ఎవరైనా మంత్రి నోటి నుంచి కరెంట్ పోతే ఎట్ల అనే మాట వస్తదా? కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అంటే ప్రభుత్వాన్ని నడపటం చేతకాని సన్నాసులు వీళ్లు. ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక జీతాలు కూడా ఇచ్చాం. కానీ నాతో సహా మా పార్టీ నాయకత్వం ఆయా వర్గాలకు వాటిని వివరించలేకపోయాం. నిజం గడప దాటే లోపే..అబద్దం ఊరంతా తిరుగొస్తదన్నట్లు. సోషల్ మీడియాలో చేసిన అబద్దపు ప్రచారాలను యూత్ నమ్మారు. ఉస్మానియా విద్యార్థులను బీరు, బిర్యానీకి ఆశపడే అడ్డా కూలీలంటూ అవమానించింది రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని విద్యార్థులు మరిచిపోతారా? నిజాలన్ని నిలకడగా మీద తెలుస్తాయి. పదేళ్లు మేము నడిపిన సంస్థలను ఇప్పటికీ ఎందుకు నడపలేకపోతున్నారు. కరెంట్ ఇచ్చుడు చేతకాక సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు. యాదాద్రి ప్లాంట్లతో కలిసి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఈ సన్నాసులకు అప్పగించాం. ఆయన సరే కరెంట్ కోతలు లేకుండా నడపలేకపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా కరెంట్ ఇవ్వగలిగారు. వీళ్లకు ఎందుకు చేతనైతలేదు. ఎంజీఎం హాస్పిటల్ లో 5 గంటలు కరెంట్ పోతుందా? భువనగిరి హాస్పిటల్ కరెంట్ పోతే టార్చ్ లైట్ వెలుగులో వైద్యం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం లో ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటివి చూశామా? ఇప్పుడు ఎక్కడ పోయినయ్ ప్రశ్నించే గొంతులు, మేధావులు ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించటం లేదు. మేడిగడ్డ విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారు. కాఫర్ డ్యామ్ కట్టాలని కేసీఆర్ చెప్పిందే చేస్తున్నారు. 5 నెలలు ఆగి, ఆగి ఇప్పుడు కడుతున్నారు. మా మీద కోపం ఉంటే మాతో చూసుకోండి కానీ రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పాం. చివరికి నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చెప్పిందంటూ ఇప్పుడు కాఫర్ డ్యాం కడతారంటా. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. సన్నాసి, చేతకాని ప్రభుత్వం ఇదని అన్నారు.