రైతు క్షేమంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో సోమవారం జరుగుతున్న రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంతకుముందు రైతు బీమాపై ఎల్ఐసీ- ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరింది.. సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ఎల్ఐసీ ఛైర్మన్ వీకే శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కేసీఆర్ మాట్లాడుతూ అన్నదాతలకు లేకలేక వచ్చిన పథకం రైతుబంధు అన్నారు. 57లక్షలమంది రైతులకు జీవిత బీమాతో లబ్ది చేకూరుతుందని తెలిపారు. రైతు మరణిస్తే 10రోజుల్లోపు రూ.5లక్షల బీమా అందుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 60 ఎకరాలు ఉన్న రైతులు కూడా గతంలో కూలి పనులకు పట్టణాలకు పోయారని గుర్తు చేశారు. రైతుల కోసం బడ్జెట్ పెట్టిన నిధులు రైతులకే ఖర్చు చేస్తామన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే రైతుబీమా పథకం అమలవుతుందన్నారు. 18 నుంచి 60ఏళ్ల మధ్య వయసు రైతులందరికీ బీమా వర్తిస్తుందన్నారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. వానల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పనిలేదని, 365రోజులూ చెరువులు నింపుతూనే ఉంటామని అన్నారు. బోరుబావులపై ఆధారపడే పరిస్థితిని పోగొడతామన్నారు. 2019 వరకు కాళేశ్వరం పూర్తవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఇక జనరేటర్ల అవసరం లేదని అయన అన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోత ఉండదన్నారు. కాళేశ్వరం పూర్తయితే రోహిణికి ముందే నాట్లు వేసుకుంటారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపుతున్నామన్నారు. భవిష్యత్లో 365 రోజులూ చెరువులు నిండుకుండల్లా ఉంటాయన్నారు. రైతులు నియంత్రణ విధానంలో పంటలు విక్రయించాలని అయన అన్నారు. మన అవసరాలు తీరగా మిగిలిన పంటల్ని ఇతర రాష్ట్రాల్లో అమ్మాలని పేర్కొన్నారు. తెలంగాణలో రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. పోచారం శ్రీనివాస రెడ్డి మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రైతులకు మంచి కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ రైతుల తరపున ఎల్ఐసీకి కృజ్ఞతలు తెలిపారు.