హైదరాబాద్, మే 31,
తెలంగాణలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం మద్యం వ్యాపారం. తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ ఇదొక్కటే. మద్యం షాపులు, బార్ ఓనర్లే కాదు.. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారు కూడా భారీగా వెనకేస్తున్నారు. అందుకే బార్స్, వైన్స్ లైసెన్స్ల కోసం లక్షల రూపాయల వెచ్చించేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇక మద్యం షాపులు, బార్ల ద్వారా ప్రభుత్వానికి నిత్యం కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగే వ్యాపారాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది.భారీగా లాభాలు వచ్చే మద్యం షాపులు, బార్లలో నేతలు, కార్పొరేట్ సంస్థల యజమానులు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. కొందరు డైరెక్టుగా పెట్టుబడి పెడితే.. కొందరు ఇండైరెక్టుగా వీటిలో వాటా కలిగి ఉంటారు. అందుకే రెండేళ్ల కోసారి నిర్వహించే మద్యం షాపుల టెండర్లకు పోటీ పెరుగుతూనే ఉంది. టెండర్ ఫీజుల లక్షల రూపాయలు ఉంది. తిరిగి చెల్లించరు.. అయినా టెండర్లు వేస్తూనే ఉన్నారు.ఇక ఇప్పుడు తెలంగాణలో బార్ ఓనర్లు, వైన్స్ ఓనర్ల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. బార్షాపుల ఓనర్లంతా ఒక్కటై వైన్ షాపుల యజమానులపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైన్ షాపు పక్కన పర్మిట్ రూమ్స్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఇది 100 చ.మీ మించి ఉండకూడదు. కానీ మద్యం షాపుల యజమానులు వీటిని పట్టించుకోవడం లేదు. 2 వేల చ.మీ వరకు కూడా పర్మిట్ రూమ్స్ నిర్వహిస్తున్నారు. దీంతో బార్లకు వచ్చే కస్టమర్లు తగ్గిపోతున్నారు. ఇక వైన్ షాపులలో ఎలాంటి తినుబండారాలు తయారు చేయరాదు. కానీ వైన్స్కు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూంలు మినీ బార్లుగా కనిపిస్తున్నాయి. ఒక్క ఏసీ మినహా ఇక్కడ అన్ని వసతులు ఉంటున్నాయి. అన్నిరకాల ఆహార పదార్థాలు దొరకుతుంటాయి.ఇదిలా ఉంటే.. వైన్స్కు ప్రభుత్వం చాలాకాలంగా పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తుంది. ఇందుకు అదనంగా రూ.2 లక్షల రుసుం వసూలు చేస్తుంది. అయితే, ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోని బార్ల యజమానులు ఇప్పుడు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది చివర్లో మద్యం షాపులకు టెండర్లు పిలిచింది. అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి కొత్త షాపులు అమలులోకి వచ్చాయి. కొత్తగా షాపులు ఏర్పాటు చేసుకున్న యజమానులు పర్మిట్ రూం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఇష్టానుసారంగా వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పర్మిట్ రూంలు ఏర్పాటు చేశారు. దీంతో బార్లకు నాలుగైదు నెలలుగా గిరాకీ తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్ల యజమానులు ఒక్కటై ఫ్యిదు చేశారు. మరి దీనిపై ఎక్సైజ్ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.