హైకోర్టు తీర్పును అమలు చేసి స్పీకర్ చట్టల సభల హుందాతనాన్ని కాపాడాలని సిఎల్పి నేత, మాజీ మంత్రి జానారెడ్డి డిమాండ్ చేసారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం రద్దుపై హైకోర్టు తీర్పును హర్షిస్తున్నామని జానారెడ్డి అన్నారు. సోమవారం సిఎల్పి లోఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానం తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తీర్పును అమలు చేసి స్పీకర్ చట్టల సభల హుందాతనాన్ని కాపాడాలన్నారు. పంచాయతీరాజ్ చట్టసవరణ కోసం అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కోమటిరెడ్డికి భద్రత కల్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశానని జానారెడ్డి పేర్కొన్నారు.సంపత్ కుమార్, కోమటిరెడ్డిల శాసన సభ్యత్వాల రద్దుపై గతంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. అయితే వారి విజ్ఞాపనను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కోమటిరెడ్డి సంపత్లపై రాజకీయ దురుద్దేశ్యంతో అనర్హత వేటు వేశారని వాళ్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేసారంటూ కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.