హైదరాబాద్, జూన్ 10,
చినుకు పడితే చిత్తడే. వాన పడితే వణుకే. ఇదీ హైదరాబాద్ వాసుల దుస్థితి. వర్షాకాలం వచ్చిందంటే నగర వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆఫీస్ నుంచి ఇంటికెళ్లాలంటే నరకమే. ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు చెక్పెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వానకాలం వర్రీకి చెక్పెట్టేలా ప్రణాళికను రూపొందించింది.ఈసారి వానకాలం కష్టాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. ప్రత్యేకంగా 542 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది. అందులో మొబైల్ 157, స్టాటిక్ 242 బృందాలు, సీఆర్ఎంపీ రోడ్లపై 29, డిఆర్ఎఫ్ 30 బృందాలు, పోలీస్ శాఖ 13 బృందాలు, విద్యుత్ శాఖ 41, వాటర్ వర్క్స్ 22 బృందాలను ఏర్పాటు చేసింది. సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.నగర వ్యాప్యంగా 125 వరద బాధిత ప్రాంతాలున్నాయి. వాటిని దశలవారీగా తగ్గిస్తూ శాశ్వత పరిష్కారం చూపారు అధికారులు. నాలాల్లో ప్రజలు చెత్త, వ్యర్థాలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. నీళ్లు నిలిచే పాయింట్ల దగ్గర పెద్ద సంపులను ఏర్పాటు చేసి వరద సమస్యకు చెక్ పెట్టారు. విపత్తు సమయాల్లో అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా నంబర్లు ఏర్పాటు చేసింది.