YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కళకళలాడుతున్న అమరావతి

కళకళలాడుతున్న అమరావతి

విజయవాడ, జూన్ 11 
వంద పొక్లయిన్‌లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కళకళలాడుతోంది. ఐదేళ్లుగా పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండు రోజుల్లో కొలువు దీరనుంది. ఈ లోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మూడు రాజధానులతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో కంప చెట్లు పేరుకుపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిని తలపించింది. ఇప్పుడు ప్రభుతవం మారడంతో అక్కడ మళ్లీ యాక్టివిటీస్‌ మొదలయ్యాయి. సీఎస్‌గా నీరబ్‌కుమార్ పగ్గాలు చెపట్టిన తర్వాత అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. మూడు నాలుగు రోజుల నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్‌ చేస్తున్నారు. దీని కోసం దాదాపు వంద పొక్లెయిన్లను ఏర్పాటు చేశారు. 25 ప్రాంతాల్లో వందకుపైగా కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి అమరావతిలో పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పనులను నీరబ్‌ కుమార్ స్వయంగా ఆదివారం పరిశీలించారు. అమరావతిలో పనులు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్... అక్కడ అధికారులతో మాట్లాడారు. సుమారు రెండు మూడు గంటలు ఆ ప్రాంతంలో గడిపిన ఆయన.. జరుగుతున్న పనులు పరిశీలించారు. రోడ్లను కూడా పరిశీలించారు. రాజధాని కోసం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా చూశారు. అక్కడి నుంచి మొదలైన ఆయన పర్యటన సీఆర్‌డీఏ ఆఫీస్‌, తర్వాత వివిధ అధికారిక భవనాలను కూడా గమనించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఉన్నతాధికారులు తమ ప్రాంతానికి రావడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరబ్‌కుమార్‌ను సన్మానించారు అదే టైంలో సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న వివేక్ యాదవ్‌ పని తీరుపై ఫిర్యాదు చేశారు. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్న పట్టించుకోవడం లేదని కలిసేందుకు కూడా సరిగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నీరబ్ కుమార్... చంద్రబాబు ఆదేశాలతో అమరావతిలో పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో పిచ్చిమొక్కులు తొలగిస్తున్నామని తర్వాత సమీక్షించి అక్కడ పనులు పురోగతిపై నివేదిక ఇస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన చోరీలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కౌలు అంశంపై కూడా త్వరగానే గుడ్ న్యూస్ చెబుతామన్నారు. మరోవైపు 12న ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అమరావతిపై సమగ్రమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న కట్టడాల పటిష్టతపై ఆరా తీయనున్నారు. దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇచ్చేలా చేసి రాజధాని పనులు త్వరితగతిన చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వేసిన రహదారులు పూర్తిగా పాడైపోయాయి. విద్యుత్ దీపాలు వెలగడం లేదు. వాటిని పునరుద్ధరించారు. రహదారులను కూడా మరోసారి సరిచేయాలి. వీటన్నింటికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి పగలు పనులు చేపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతో రాజధాని ప్రాంతంలో జనాల రాకపోకలు కనిపిస్తున్నాయి.

Related Posts