YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ ఏపీకి అన్యాయమేనా...

మళ్లీ ఏపీకి అన్యాయమేనా...

విజయవాడ, జూన్ 11,
ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ , చంద్రబాబునాయుడు పేర్లు గత వారం రోజులుగా దేశ రాజకీయాల్లో మార్మోగిపోతున్నాయి. మోదీ 3.0 ఏర్పడటానికి ఆంధ్రప్రదేశే కారణమని అందరూ విశ్లేషిస్తున్నారు. అది నిజం కూడా. ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 లోక్ సీట్లు వచ్చాయి.  మొత్తంగా ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లు 293 మాత్రమే. వీటి నుంచి ఏపీ నుంచి వచ్చిన సీట్లను మైనస్ చేస్తే ఎన్డీఏ కూటమి మెజార్టీకి తగ్గిపోతుంది. గతంలో ఎన్డీఏకు ఒక్క సీటు కూడా లేదు. ఇప్పుడు 21 వచ్చాయి. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఏపీ పేరు మార్మోగింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయంపైనా ఆసక్తి ఏర్పడింది. అయితే చంద్రబాబు మాత్రం తామ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. కలసే పయనిస్తామని స్పష్టం చేశారు.కౌంటింగ్ జరిగిన రోజు నుంచి జాతీయ మీడియాలో కింగ్ మేకర్ అంటూ టీడీపీకి హైప్ వచ్చింది. పది మంత్రి పదవులు, స్పీకర్ పదవిని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు కానీ.. జాతీయ మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ కానీ.. తాము కేంద్రంలో మంత్రి పదవుల కోసం  చూడటం లేదని రాష్ట్రం ప్రయోజనాల కోసమే చూస్తున్నామని ప్రకటించారు. అయితే పైకి అలా అంటున్నారు కానీ వచ్చిన హైప్‌కు తగ్గట్లుగా పదవులు లభిస్తాయని అనుకున్నారు. రెండు కేబినెట్ పదవులు, రెండు కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు వస్తాయని అనుకున్నారు.  అయితే వచ్చిన హైప్‌కు కేటాయించిన పదవులు, శాఖలకు  పొంతన లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం  పార్టీకి వచ్చిన హైప్‌ను బట్టి చూస్తే.. అనుకున్న విధంగా పదవులు,  కీలక శాఖలు రాలేదు . కింగ్ మేకర్ గా టీడీపీని జాతీయ రాజకీయ నేతలు అభివర్ణించారు. అయితే కేబినెట్ లో ఆ స్థాయిలో ప్రాధాన్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.  చివరికి ఒక్క కేబినెట్, ఒక్క సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు.  శాఖలు కూడా ఏపీకి అంతగా ఉపయోగపడేవి కావు.  రామ్ మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చినా ఏపీ కి రాజధాని నిర్మించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ గతంలో అశోక్ గజపతిరాజుకు ఇచ్చిన పౌర విమానయానమే ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బోగాపురం ఎయిర్ పోర్టును వేగంగా పూర్తి చేసుకునే అవకాశం మాత్రం లభిస్తుంది.   గుంటూరు ఎంపీ పెమ్మసాని మెడికల్ రంగంలో నిపుణుడు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి కేటాయిస్తారేమో అనుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ చీఫ్ కుమారస్వామికి భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. మొత్తంగా టీడీపీకి నిరాశే ఎదురయింది. కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియాలో జరిగిన ప్రచారంతో మోదీ మళ్లీ కోపం తెచ్చుకున్నారేమో కానీ.. హైప్ మాత్రమే టీడీపీకి మిగిలిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇద్దరు, ఒక్క ఎంపీ ఉన్న పార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. కానీ జనసేన పార్టీకి మాత్రం చాన్స్ ఇవ్వలేదు. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. పవన్ కల్యాణ్ తుఫాన్ అని మోడీ పొగిడారు కానీ.. దానికి తగ్గట్లుగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  కేంద్ర కేబినెట్‌లో జనసేనకు చోటు లేకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌తో బీజేపీ అగ్రనేతలు చర్చించారని అంటున్నారు. మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై కొన్ని మార్గదర్శకాలు పెట్టుకున్నారని ఆ ప్రకారమే జనసేన కు చోటు కల్పించలేకపోయారని భవిష్యత్ లో రాజకీయ పరిణామాలను బట్టి పరిశీిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.  ఐదుగురు ఎంపీలు అంత కంటే ఎక్కువ ఉన్నవారికి ఓ కేబినెట్ ర్యాంక్ పదవి, తక్కువ ఉన్న వారికి ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. ఒకటి, రెండు ఎంపీలు ఉన్న పార్టీలకు ఆయా పార్టీల అధ్యక్షులకు అయితే ఇవ్వాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీని చీల్చి ఆయన పార్టీని బీజేపీ సాయంతో లాగేసుకున్న అజిత్ పవార్ పార్టీకి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. సహాయ మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నామని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయలేదని బీజేపీ వర్గాలంటున్నాయి.అదే సమయంలో  పవన్ కల్యాణ్ కూడా తమకు కేంద్రకేబినెట్‌లో చోటు ఉండాలని పట్టుబట్టలేదని తెలుస్తోంది. తమకు పదవులు ముఖ్యం కాదని ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారని అంటున్నారు. అప్పటికే ఏపీ నుంచి కేబినెట్ ర్యాంక్ తో పాటు ముగ్గురికి కేంద్ర మంత్రులుగా చాన్సిచ్చినందున… జనసేన పార్టీకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు. అయితే పదవులు ఇవ్వకపోవడానికి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు కానీ..  కూటమికి జనసేన చేసిన కాంట్రిబ్యూషన్ ప్రకారం కనీసం ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందన్న అభిప్రాయం ఉంది. ఏపీ ఆర్థిక పరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వారానికి రెండు వేల కోట్లు అప్పు చేస్తే తప్ప బండి నడిచే పరిస్థితి లేదు. అమరావతి, పోలవరం సహా అనేక ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాల్సి ఉంది. వీటన్నింటికీ  కేంద్ర సహకారం అవసరం. కేంద్రం పట్టించుకోకపోతే కూటమిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది.

Related Posts