YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్... రంగంలోకి ఈడీ...

ఫోన్ ట్యాపింగ్... రంగంలోకి ఈడీ...

హైదరాబాద్, జూన్ 13,
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరగబోతోందా? ఈ కేసు వివరాలను ఈడీ అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారా? త్వరలో ఈ వ్యవహారంలో భారీగా చేతులు మారిన అక్రమ నగదు లావాదేవీల మీద విచారణకు ఈడీ వచ్చే అవకాశముందా? అంటే.. అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఈడీ రాక ఖాయమనే వాదన మొదలైంది. తెలంగాణలోని గత రెండు అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బు సమకూర్చామని రాధాకిషన్ రావు, ఆయన బృందంలోని అనేకమంది పోలీసు అధికారులు విచారణలో కుండబద్దలు కొట్టటంతో బాటు ఈ వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీల విచారణ పేరుతో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో గులాబీ నేతల్లో భయం మొదలైంది. నిజంగా ఈడీ రంగంలోకి దిగితే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో నాడు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా పోటీచేసిన నేతలతో బాటు ఈ వ్యవహారంతో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయలకూ ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మీద తెలంగాణ పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 68 పేజీల ఛార్జ్‌షీట్‌లో పోలీసులు మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చగా వీరిలో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్టు సస్పెండైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు, సస్పెండైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌లో ఉన్నట్టు అందులో వివరించారు. 69 మంది సాక్షుల వాంగ్మూలాలను అభియోగపత్రంలో నమోదు చేశారు. వీరిలో గతంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పోలీసు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. వేలాది పేజీల్లో అభియోగాలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞనంతో కూడిన అంశాలుండడంతో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, మరో నిందితుడిని విచారించాక మరిన్ని ఆధారాలతో పూర్తి అభియోగపత్రం దాఖలు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. పోలీసులు చార్జిషీటు దాఖలు చేయటంతో ఈ కేసులో ఈడీ రాక ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కేసు విచారణలో నిందితులు చెప్పిన దానిని బట్టి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల నిధులు రవాణా అయ్యాయి. ఈనాటి పరిస్థితులను బట్టి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెడుతున్న ఖర్చు రూ. 60 కోట్ల వరకు ఉంటోందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులో నాలుగో వంతు ప్రకారం లెక్కగట్టినా ఒక నియోజక వర్గంలో రూ. 15 కోట్ల మొత్తాన్ని నిందితులు తమ వాహనాల్లో వీరు రవాణా చేసి ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని 119 స్థానాల్లో తక్కువలో తక్కువగా 50 స్థానాల్లో ఇలా చేసినా.. ఒక ఎన్నికలో వీరు చేరవేసిన మొత్తం.. రూ. 750 కోట్లు అయి ఉంటుంది. ఈ లెక్కన రెండు అసెంబ్లీ ఎన్నికలకు కలిపి రూ. 1500కు పైగా మొత్తం అక్రమంగా రవాణా అయిందని భావించాలి. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో కలిపి ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు చేరే అవకాశం ఉందనేది ఒక అంచనా. మరి.. ఇంత పెద్దమొత్తంలో ఈ నగదును సమకూర్చిందెవరు? ఎక్కడి నుంచి ఆ వాహనాలు ఎక్కడికి ప్రయాణించాయి? ఆ నగదు అందుకున్నదెవరు? ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టిందెవరు? అనే అంశాలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. నాడు అధికార పార్టీకి ఫండింగ్ చేసిన వ్యాపారవేత్తలు, మద్దతుదారులూ విచారణకు సిద్ధం కావాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కాజా శరత్‌ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పలు పత్రికల్లో ఈ అంశంపై వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుమోటో పిటిషన్‌పై మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇందులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), తెలంగాణ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏకంగా న్యాయమూర్తుల ఫోన్‌లనూ ట్యాప్ చేశారనే విషయం బయటికి రావటంతో హైకోర్టు విచారణకు దిగటంతో.. ఈ అంశంపై అన్ని ఆలోచించే విచారణకు దిగాలని ఈడీ భావించే అవకాశాలున్నాయి.ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ రావులు విదేశాలకు పరారు కాగా, వారిని వీలున్నంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కీలక నిందితులను వీలున్నంత త్వరగా తీసుకొచ్చి, వారిని విచారణ చేపడితే ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులెవరనేది స్పష్టంగా తెలిసిపోనుందని విచారణ వర్గాలు చెబుతున్నాయి.తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు చిన్న, పెద్ద అధికారులూ ఉన్నారు. బదిలీల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాల తాలూకూ ఆధారాలను కాపాడేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు బుధవారం నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తమ క్లయింట్లను అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ, వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తికాగా.. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Related Posts