YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరిపాలనపై పట్టు సాధించని రేవంత్

పరిపాలనపై పట్టు సాధించని రేవంత్

హైదరాబాద్, జూన్ 15,
తెలంగాణలో పరిపాలన ఇంకా  గాడిన పడలేదు.  ప్రభుత్వం ఇంకా కిందా మీదా పడుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదాస్పదమవుతోంది. మద్యం బ్రాండ్ల విషయంలో ఏం జరిగిందో అంతా గందరగోళంగా మారిపోయింది.  అధికారంలోకి వచ్చిన తర్వాతే పాఠ్యపుస్తకాలు ప్రింటింగ్ చేసినా.. అందులో సీఎం కేసీఆర్ అంటూ పేజీలు ముద్రించారు. అవి పంపిణీకి వచ్చే వరకూ ఎవరూ గుర్తించలేదు. మరో వైపు గత ప్రభుత్వంలో అవినీతి పై జరుగుతున్న విచారణల్లో ఒకరు ముందు.. మరొకరు వెనక్కి లాగుతున్నారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తి పట్టు లేదన్న అభిప్రాయం కలుగుతుంది. అదే నిజమని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యక్తి కాదు. వ్యవస్థ. మొత్తం వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలి.  ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించగలగాలి. తన కనుసన్నల్లో పాలన చేయగలగాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ ఓ సీఎంలా వ్యవహరిస్తారు.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతోంది.  మంత్రిత్వశాఖల్లో ఏం జరుగుతుందో సీఎంకు తెలియడం లేదు. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో కొత్తగా ఎలాంటి లిక్కర్‌ షాపులకు అనుమతులివ్వ లేదని ఆబ్కారీ శాఖ మంత్రి గత నెలలో ప్రకటించారు. మంత్రి ప్రకటించిన వారం రోజులకే  ఇతర రాష్ట్రాల బీర్ల కంపెనీలకు సరఫరాకు అబ్కారీ శాఖ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ప్రతి పక్షాలతోపాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటి అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. అనుమతులు పొందిన సదరు కంపెనీలపై దేశ వ్యాప్తంగా అనేక ఆరోపణలున్నాయనీ, రాష్ట్రాల ఖజానాలకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమైంది. నిబంధనల మేరకే సోమ్‌ డిస్టిలరీ కంపెనీకి మద్యం సరఫరా చేసేందుకు అనుమతిచ్చామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డిమాండ్‌ ను బట్టి కొత్త కంపెనీలకు బెవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనుమతులను మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కానీ ఏదో జరుగుతోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ అంశంపై ముఖ్యమంత్రికి సమాచారం లేదని.. అందుకే త్వరలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయాలనుకుంటున్నారని అంటున్నారు.  ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకుపైగా అవుతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో  తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండానే కొత్త బుక్స్ ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్‌ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి.  24 లక్షల పుస్తకాల్లోని ముందుమాటలో   మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు  ఈ విషయం సోషల్‌ మీడియాలో రావడంతో   పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఆయా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. కానీ తర్వాత ఆ పేజీ వరకూ స్టిక్కర్లు అంటించాలని చెప్పింది. ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారింది. చివరికి  ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డిలను  తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.   ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని విచారణలకు ఆదేశించారు. అందులో వేగం లేకపోవడం వెనుక ప్రభుత్వంలోని వివిధ స్థాయిల వ్యక్తులు జోక్యం చేసుకోవడమే అన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటు వైపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి అది కోల్డ్ స్టోరీజీకి చేరిందన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో అనేక మంది జోక్యం చేసుకున్నారన్న గుసగుసలు కాంగ్రెస్ లో ఉన్నాయి. అలాగే కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై జరిగుతున్న విచారణల్లోనూ అదే పరిస్థితి. స్వయంగా కొంత మంది ఇంజినీర్లు టెలీ కాన్ఫరెన్స్ పెట్టుకుని కాళేశ్వరం విషయంలో అందరం ఒకే మాట చెబుతామని ఒప్పందానికి వచ్చారని బయటపడింది. ఇది తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి వార్నింగ్ ఇచ్చారని మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ అసలు అంతకు మించి ఏదో జరుగుతోందని.. అది ముఖ్యమంత్రి దాకా వెళ్లడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి.రేవంత్ సీఎం అయినప్పటికీ పలు శాఖల్ని సీనియర్లు నిర్వహిస్తున్నారు. వారికి రేవంత్ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం లేదు. వారి శాఖల్లోనే వివాదాలు ఉన్నాయి.  ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నింటికీ బాధ్యుడు. కానీ ఆయన ప్రభుత్వంపై పట్టు పెంచుకోవడానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.  ఫలితంగా లిక్కర్ బ్రాండ్ల వంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం నడపడం ఆషామాషీ కాదు. కానీ కనుసన్నలతో ప్రభుత్వాన్ని నడిపేవారు ఉంటారు.  అతి కష్టం మీద నడిపేవారు ఉంటారు. ఏదో నడిచిపోతుందని అలా వదిలేసేవారు ఉంటారు. కానీ తమదైన ముద్ర వేయకపోతే.. ప్రజలు కూడా పవర్ ఫుల్‌గా గుర్తించరు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. రేవంత్ నాయకత్వ సామర్థ్యంపై విమర్శలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Related Posts