YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

30న డీఎస్సీ నోటిఫికేషన్

30న డీఎస్సీ నోటిఫికేషన్

విజయవాడ, జూన్ 28,
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుక సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను కూడా అదే రోజు వెల్లడించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. నియామకాల ప్రక్రియను డిసెంబరు 10లోగా పూర్తి చేసి, జాయిన్ ఆర్డర్స్ కూడా అభ్యర్ధులకు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 80 శాతం పోస్టులు స్థానికులకి అవకాశం ఇచ్చేలా నోటిఫికేషన్‌ను రూపొందిస్తున్నారు. మిగిలిన 20 శాతం పోస్టులను నాన్ లోకల్ కింద భర్తీ చేసే అవకాశం ఉంది.సీఎం చంద్రబాబు సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మెగా డీఎస్సీకి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హులైన అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి వీలుగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మళ్లీ టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పిన సర్కార్ ఉన్నట్లుండి.. టెట్ కమ్ డీఎస్సీ అని యూటర్న్ తీసుకోవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. మెగా డీఎస్సీకి ముందే టెట్ పరీక్ష నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి విడిగా.. కొత్తగా అర్హత సాధించవల్సిన వారికి మరొకటిగా రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువరిస్తామంటోన్న విద్యాశాఖ నిర్ణయం చర్చణీయాంశంగా మారింది.ఈనెల 30న 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, పరీక్ష నిర్వహణ, దీంతో పాటే టెట్ నిర్వహణకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో 80 శాతం పోస్టులను స్థానికులకు ఇచ్చేలా, మరో 20 శాతం నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. 26 జిల్లాలకు కాకుండా.. 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related Posts