YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం

అమరావతి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని....తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.

డీఎస్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
మాజీ మంత్రి,ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్  తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి గా ,పిసిసి చీఫ్ గా చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్  గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో  ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డిఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించారు.

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పార్టీలో వివిధ స్థాయిల్లో, సుదీర్ఘ కాలం పాటు  ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్  రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌  రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి పనిచేశారు.
సోనియా గాంధీకి విధేయునిగా
డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు తెరాస రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో భారాసతో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.. : అర్వింద్‌
‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు.
నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.
పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’’ అని డీఎస్‌ కుమారుడు అర్వింద్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

Related Posts