YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతకు సిద్ధం

బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతకు సిద్ధం

వరంగల్, జూలై 3,
వరంగల్ పార్టీ ఆఫీస్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.రూ.కోట్లు విలువ చేసే జాగాను అగ్గువకే అప్పజెప్పారని మొదట్లోనే విమర్శలు వినిపించగా, ఆ ఆఫీస్ను అక్కడి నుంచి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఓరుగల్లులో ఇదే హాట్ టాపిక్ గా మారింది.రెండు రోజుల కిందట నల్గొండ లోని బీఆరెస్ పార్టీ విషయంలోనూ ఇదే తీరుగా ఆరోపణలు రాగా.. మంత్రి కోమటిరెడ్డి దానిని కూల్చేయాల్సిందుగా ఆదేశించారు. దీంతో హనుమకొండ లోని ఆఫీస్ ను కూడా కూల్చేయబోతున్నారనే చర్చ నడుస్తోంది.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జిల్లా ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రెండూ బాలసముద్రంలోని సర్వే నెంబర్ 1066లో నిర్మించారు. అక్కడ గజం రూ.75 వేలకు పైగానే పలుకుతుండగా, ప్రభుత్వ స్థలం కావడం, అందులోనూ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో గజం కేవలం రూ.100 కే ఇచ్చేశారు. అంటే దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువ చేసే ల్యాండ్ ను కేవలం రూ.4 లక్షలకే అప్పజెప్పినట్లు తెలుస్తోంది.పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయింపుపై అప్పట్లో వివాదం కూడా చెలరేగింది. ఇదిలాఉంటే పార్టీ ఆఫీస్ నిర్మాణ క్రమంలో దానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని తెలిసింది. అంతేగాకుండా అదంతా బాలసముద్రంలోని వెంచర్ పార్కు స్థలం కాగా, పార్కు స్థలాన్ని మింగేసి పార్టీ ఆఫీస్ ను నిర్మించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆ పార్టీ ఆఫీస్ బిల్డింగ్ కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం, నెంబర్ లేకుండా మీటర్లు తిరుగుతుండటం, ఇంతవరకు బిల్లు కట్టిన దాఖలాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది.బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ఆఫీస్ ను వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన దాస్యం వినయ్ భాస్కర్ ఓటమి చెందగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఆనుకునే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను నిర్మించడంతో సమస్య మొదలైంది. క్యాంప్ ఆఫీస్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాగా, దాని పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఒకే రోజు రెండు పార్టీల కార్యక్రమాలు ఉంటే.. అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఒక రకంగా ఫైటింగ్ సిట్యుయేషన్ ఏర్పడేది. పలుమార్లు ఇదే సమస్య తలెత్తగా, ఇద్దరి మద్య బందోబస్తు నిర్వహించడానికి పోలీసులకు ఇబ్బందులు తలెత్తేవి.శాశ్వతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అధికారంలో ఉంటారనే భావనతోనే పార్టీ ఆఫీస్ ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలోనే నిర్మించారనే అభిప్రాయాలు వినిపిస్తుండగా, తరచూ ఇబ్బందుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.పార్కు స్థలంలో పార్టీ ఆఫీస్ ను అక్కడి నుంచి తరలించి, వేరే చోట ప్రభుత్వ స్థలం చూపాలని ఆయన అధికారులకు లెటర్ పెట్టారు. దీంతో హనుమకొండ ఆర్డీవో ఎన్.వెంకటేశ్ ప్రభుత్వానికి చెందిన ఎకరం స్థలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్ కాపీలను అందించాల్సిందిగా లేఖ రాశారు.దీంతో పర్మిషన్ తీసుకున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో జూన్ 25న కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ సంబంధిత బిల్డింగ్ పర్మిషన్ కాపీలు, ల్యాండ్ కేటాయింపునకు సంబంధించి డాక్యుమెంట్లు మూడు రోజుల్లోగా అందించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ కాగా, ఆయన గడువులోగా రిప్లై ఇవ్వలేదు. దీంతో రెండు రోజుల కిందట గ్రేటర్ వరంగల్ సిటీ ప్లానర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు నేరుగా వినయ్ భాస్కర్ వద్దకు వెళ్లి మరీ నోటీసులు సర్వ్ చేశారు.ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మించారనే ఆరోపణలు ఉండటంతో పాటు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలిసింది. అందుకే అధికారులకు ఫిర్యాదు చేసి మరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

Related Posts