ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రమేయం ఉందని తెలియడంతో అంతా షాకయ్యారు. అయితే ఈ బెట్టింగ్లో మరింత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. థానే క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ మరికొంత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురు బాలీవుడ్ సెలబ్రిటీలకు బెట్టింగ్తో సంబంధం ఉన్నట్లు అర్బాజ్ పోలీసులకు స్పష్టం చేశారట. ముంబైలో ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుందని సమాచారం అందడంతో మే 15న థానే క్రైం బ్రాంచ్కు చెందిన యాంటీ-ఎక్స్టార్షన్ సెల్ పోలీసులు దాడులు చేసి నలుగురును అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి సోను జలాన్ అలియాస్ సోను మలాద్ కూడా ఉన్నాడు. ఇతను దేశంలో టాప్ బుకీలలో ఒకడని పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా జలాన్కు అర్బాజ్ ఖాన్తో సంబంధలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా అర్బాజ్ ఖాన్ను సమన్లు పంపారు. విచారణలో వీరిద్దరూ ఒకరికొకరికి ఐదేళ్లుగా పరిచయం ఉన్నట్లు ఒప్పుకున్నారని యాంటీ-ఎక్స్టార్షన్ సెల్ హెడ్, సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ వెల్లడించారు. అయితే ప్రస్తుతం బయటికొచ్చిన సమాచారం ప్రకారం బాలీవుడ్కు చెందిన మరో ఏడుగురు పేర్లను అర్బాజ్ బయటపెట్టినట్లు తెలుస్తోంది. వీరందరినీ జలాన్కు తానే పరిచయం చేశానని కూడా అర్బాజ్ ఒప్పుకున్నారట. వీరిలో ఇద్దరికి సమన్లు కూడా అందాయని అంటున్నారు. బాలీవుడ్ నిర్మాతలు పరాగ్ సంఘ్వి, మురాద్ ఖైతాన్కు పోలీసులు సమన్లు పంపినట్లు సమాచారం. అయితే పరాగ్ సంఘ్వికి జలాన్కు భాగస్వామి అని సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ శర్మ స్పష్టం చేశారు. అయితే సమన్లు పంపిన విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ముంబైకి చెందిన ఓ పెద్ద బిల్డర్ కుమారుడు దిలీప్ లుధాని కూడా టాప్ బుకీ అని, అతని పేరును కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరోసారి అర్బాజ్ ఖాన్ను విచారణకు పిలిచే అవకాశముంది.