YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డానా...

నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డానా...

హైదరాబాద్, జూలై 5,
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నేతలతోపాటు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికార కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్షం కాంగ్రెస్‌లో విలీనమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మ్మెల్యేల చేరిక దానం నాగేందర్‌తో మొదలైంది. తర్వాత తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌కుమార్, కాలె యాదయ్య ఇలా ఆరుగురు చేరారు. ఇంకా చాలా మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్ట్స్‌ కాంగ్రెస్‌లో చేరే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎవరన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి క్యూలో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య అలకతో ఆయన చేరికకు చివరి నిమిషంలో బ్రేక్‌పడింది. ప్రస్తుతం జెడ్పీ చైర్‌ప్సన్‌ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కృష్ణమోహన్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయింది.అన్నీ అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. అయితే పార్టీ మార్పు వార్తలను కృష్ణమోమన్‌రెడ్డి మాత్రం కొట్టిపారేస్తున్నారు. పార్టీ మార్పు విషయంపై ఎమ్మెల్యేను అడగగా.. ప్రజల కోసం పార్టీ మారడానికి సిద్ధమేనని జోగుళాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి కోసం పార్టీ మారాలని కార్యకర్తలు అడుగుతున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్‌లోకి రావాలని మంత్రి జూపల్లి ఆహ్వానించింది నిజమేనని ఎమ్మెల్యే చెప్పారు.కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని నల్లగుంటలో ఓ కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో గద్వాల జిల్లాలో రాజకీయాలు వేడుక్కుతున్నాయి.బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదట టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన..2014 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఆ తర్వాత 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు.పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా తమ చేరికను చివరి నిమిషం వరకు గోప్యంగానే ఉంచారు. ఇప్పుడు కృష్ణమోహన్‌రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారని, అందుకే పార్టీ మార్పు వార్తలను కొట్టిపారేస్తున్నారని తెలుస్తోంది.

Related Posts