హైదరాబాద్, జూలై 15
సామాన్యులకు నిత్యవసర సరుకులు ధరలు షాక్లు మీద షాక్లు ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు, సగటు వేతనజీవి బెంబేలెత్తిపోతున్నారు. మెున్నటి వరకు కేజీ టమోటా రూ.100కు పైగా పలకగా.. క్రమంగా ఆ ధరలు తగ్గుతున్నాయి. టమాట ధరలు తగ్గుతున్నాయని ఆనందపడే లోపే.. కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చొని సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.నిన్న మెున్నటి వరకు కేజీ రూ.140-160 మధ్య ఉన్న కంది పప్పు ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం కిలో కంది పప్పు ధర రూ. 180-200 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో క్వాలిటీని బట్టి కేజీ రూ. 220-240 వరకు కూడా ధర పలుకుతోంది. ఇక కందిపప్పుతో పాటు మిగతా పప్పుల ధరలు కూడా పెరిగాయి. కేజీ పెసరపప్పు గత నెల క్రితం రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 120కి చేరింది. ఉల్లి ధరలు కూడా ఘాటెక్కాయి. వాటిని కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. గతంలో కేజీ ఉల్లి రూ. 25కు లభించగా.. ప్రస్తుతం రూ. 50కి చేరింది. చిరు వ్యాపారులు రూ.100కు నాలుగు కేజీల చొప్పున విక్రయించగా.. ప్రస్తుతం రూ.100 రెండు, రెండున్న కేజీలు మాత్రమే ఇస్తున్నారు. గతేడాది వర్షాభావం వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. అందువల్లే ధరలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు.ఇక సండే రోజు చికెన్, మటన్ తినాలకున్న నాన్ వెజ్ ప్రియులకు కూడా వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ ధరలు ఇంకా దిగి రావటం లేదు. ప్రస్తుతం కేజీ చికెన్ రూ. 270- 300 మధ్య పలుకుతోంది. ఇక మటన్ విషయానికొస్తే కేజీ రూ. 800 నుంచి రూ. 1000 మధ్య పలుకుతోంది. దీంతో సండే పూట ముక్కతో విందు భోజనం చేసుకుందామని అనుకున్న భోజన ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని నిట్టూరుస్తున్నారు.