YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీతో బంధం... టీడీపీ అడుగులు

బీజేపీతో బంధం... టీడీపీ అడుగులు

హైదరాబాద్, జూలై 16
2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఐదేళ్లు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఐదేళ్ల క్రితం జరిగిన పరాభవాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని గ్రహించారు. దీంతో బీజేతో దోస్తీకి ఏడాదిపాటు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసి భారీ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఇక ఇదే సమయంలో టీడీపీ ఒంటరిగా 16 ఎంపీ సీటుల గెలిచింది. బీజేపీ 3, జనసేన 2 ఎంపీస్థానాల్లో గెలిచాయి. ఇక కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి 246 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన కమలం.. ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీఏలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన టీడీపీ కీలకంగా మారింది. దీంతో బీజేపీ తన మిత్రపక్షాలు అయిన టీడీపీ, జేడీయూ మద్దతుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు దిట్ట. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇన్నేళ్త తర్వాత మళ్లీ కేంద్రంలో కీలకంగా మారారు. దీంతో మరోమారు బాబు తనదైన పాలిట్రిక్స్‌ మొదలు పెట్టారు. ఒకవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కీలకంగా ఉంటూనే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌తో తెరచాటు రాజకీయం మొదలు పెట్టారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెవడంతోపాటు తెలంగాణలో ఉంటున్న ఆంధ్రుల ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణ కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారం చేపట్టిన పక్షం రోజుల్లోనే ‘కలుసుకుందాం’ అని తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి స్వయంగా లేఖరాశారు. విభజన హామీలపై చర్చల పేరుతో తెలంగాణలో చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టారు. ఇక ఆయన రాక సందర్భంగా టీడీపీ నేతుల కూడా యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు సూచన మేరకే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సుమారు 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజు చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దాం అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికెలపూడి గాంధీ చంద్రబాబును కలిశారు. ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసింది. ఇప్పుడు ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూడా బీఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ నేతలు, బీఆర్‌ఎస్‌ ప్రస్తుత ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం ఇందులో భాగమే అని తెలుస్తోంది. తెలంగాణలో తన శిష్యుడికి మద్దతుగా ఉంటూనే విపక్ష బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు నాయుడును కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికెలపూడి గాంధీకి కాంగ్రెస్‌లో చేరాలని సూచించినట్లు సమాచారం. ఈమేరకు ప్రకాశ్‌గౌడ్‌  సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అరెకెలపూడి గాంధీ కూడా నేడో రేపో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. క్యాడర్‌కు కూడా దిశానిర్దేశం చేశారు. తన శిష్యుడి సహకారంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతోపాటు, మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. కుదిరితే ఒకటి రెండు జిల్లా పరిషత్లపైనా టీడీపీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్న సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా బీఆర్‌ఎస్‌ లేకుండా చేయాలని చూస్తున్నారు.

Related Posts