బీజేపీ నేతలు కూడా చేయనంతగా.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం ప్రధాని మోడీ నామస్మరణ చేస్తున్నారు. సమావేశమేదైనా, సందర్భం ఏదైనా.. చివరకు మోడీ దగ్గరకు రావాల్సిందే అక్కడే తన స్పీచ్ను ముగించాల్సిందే! ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంతలా మోడీ నామాన్ని జపిస్తున్నారు?గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ జపం చేసి విజయం తన ఖాతాలో వేసుకున్నారు...గత ఎన్నికల్లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ తన గెలుపునకు బాటలు వేస్తారని చంద్రబాబు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే ఆయన కేవలం మోడీ తప్ప ఎవరూ తన ప్రత్యర్థి కాదనే అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నారు.2019 ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు `మోడీ` మంత్రాన్ని ఎంచుకున్నారు. వీలైనంత ఎక్కువగా మోడీ వైఫల్యాలు, ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళితే తనకు అంతకు మంచిన మైలేజ్ దక్కుతుందని నిర్ణయించిన ఆయన.. ఇప్పుడు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని చెబుతున్నారు విశ్లేషకులు.నేను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేద్దామని ప్రయత్నిస్తుంటే.. కేంద్రం అడ్డుకుంటోంది. ఢిల్లీని మించిన రాజధాని ఏపీలో కడదామని భావిస్తుంటే.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం.. తీరని అన్యాయం చేసింది..` అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే ప్రజలకు వివరిస్తున్నారు.నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేసేందుకు కేంద్రం సాయం చేయలేదంటూ.. ప్రజల దృష్టిలో తనను తాను నిరపరాధిగా చెప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఒకపక్క ఏపీలో అవినీతి భారీగా పెరిగిపోయిందంటూ వైసీపీ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నా.. తాను మాత్రం ఒక్క మోడీనే నమ్ముకుని 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు చంద్రబాబు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ మట్టి, నీళ్లు తెచ్చినప్పుడే ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు మోడీని, బీజేపీని నమ్ముకున్నారు. అందుకే ఇఫ్పుడు ఆయన తన గెలుపునకు మోడీని ఎంచుకున్నారు.నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పెను సవాళ్లను అవలీలగా దాటేసిన చంద్రబాబుకు.. 2019 ఎన్నికలు మాత్రం పెను సవాల్గా మారబోతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ, మోడీ వేవ్, జనసేనతో కలసి విజయం జేబులో వేసుకున్న విషయం తెలిసిందే! అయితే ఇప్పుడు కూడా మోడీనే నమ్ముకుని 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు! అదెలా అంటే.. చంద్రబాబు బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకోకముందే ఏపీ ప్రజలు బీజేపీ, మోడీపై కసి పెంచుకున్నారు. కానీ వీటిని గ్రహించలేని చంద్రబాబు.. ఆలస్యంగా మోడీపై హుటాహుటిన యుద్ధం ప్రకటించేశారు.తనను తిట్టే ఎవరైనా సరే.. మోడీతో మిలాఖత్ అయినట్లు ప్రచారం చేసే ప్లాన్ చాలా రోజుల నుంచే అమలు చేస్తున్నారు. అంతా మోడీతో కుమ్మక్కు అయ్యారని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్, జగన్ పై వ్యతిరేకత పెంచి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలనే వ్యూహాంలో చంద్రబాబు ఉన్నారు. తన నలభై ఏళ్ల అనుభవంతో చేసిన పనులు చెప్పుకోలేక మోడీని నమ్ముకుని.. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్లాన్ వేసుకున్నారట.