YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆదాయం పెంచుకొనేది ఎలా

ఆదాయం పెంచుకొనేది ఎలా

విజయవాడ, జూలై 23
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం గత కొన్నేళ్ళుగా తగ్గిపోతోంది. 2014-19 మధ్య అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం ఆ తర్వాత గణనీయంగా పడిపోయింది. ఇందులో విధానపరమైన లోపాలతో పాటు పన్ను ఎగవేతలు యథేచ్ఛగా సాగడమే దీనికి ప్రధాన కారణం.జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు చెల్లించే పన్నులు, ప్రభుత్వానికి జమ చేసే పన్నుల్లో వ్యత్యాసం పెరిగిపోయింది. కొన్నేళ్ళ క్రితం ఓ ఉద్యోగ సంఘంతో ప్రభుత్వానికి ఘర్షణ వైఖరి ఏర్పడటానికి కారణం కూడా ఇదేననే ప్రచారం ఉంది. పన్నుల వసూళ్లను నేరుగా పర్యవేక్షించే శాఖల్లో కొందరి చేతివాటంతో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిఎస్టీ వసూళ్లలో ప్రభుత్వానికి- పన్ను చెల్లింపు దారులకు మధ్య వ్యాపారులు మాత్రమే ఉంటారు.కొనుగోలు దారుడు చెల్లించే పన్ను ప్రభుత్వానికి సక్రమంగా చేరుతుందా లేదో పర్యవేక్షించే యంత్రాంగం మాత్రం గాడి తప్పింది. ఇలా కొన్ని వందల కోట్ల రుపాయలు దారి మళ్లాయనే ఆరోపణలపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. వీటి విచారణ ఎటూ తేలలేదు.జిఎస్టీ వసూళ్లతో పాటు ఏపీలో సేల్స్‌ టాక్స్‌ ద్వారా వచ్చే ఆదాయానికి కూడా భారీగా గండి పడింది. పెట్రోల్, డీసెల్, గ్యాస్ అమ్మకాలపై వచ్చే ఆదాయంలో గత ఐదేళ్లలో దాదాపు రూ.3500కోట్ల రుపాయలకు గండిపడింది. దీనికి ప్రధాన కారణం ఏపీతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం.2018-19లో ఏపీలో సేల్స్ టాక్స్ ఆదాయం రూ.22వేల కోట్ల రుపాయలుగా ఉంటే 2023-24కు అది రూ.18,500కోట్లకు పడిపోయింది. ఐదేళ్లలో దాదాపు రూ.3500కోట్ల ఆదాయాన్ని ఏపీ కోల్పోయింది. ఇలా సేల్స్‌ టాక్స్‌ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం కర్ణాటక, తెలంగాణ, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఇంధన సుంకాలు అధికంగా ఉండటంతో ఏపీలో అమ్మకాలు పడిపోయాయి.ఏపీలో ఐదేళ్లలో సేల్స్‌ టాక్స్‌ రూపంలో ఐదేళ్లలో రూ.3500కోట్ల రుపాయల ఆదాయాన్ని కోల్పోతే పొరుగున ఉన్న తెలంగాణలో 2018-19లో 19వేల కోట్ల నుంచి 2023-24నాటికి రూ.29వేల కోట్ల రుపాయలకు ఆదాయాన్ని పెంచుకోగలిగింది. సేల్స్‌ టాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్‌ ఆదాయం కూడా ఐదేళ్లలో గణనీయంగా పడిపోయినట్టు ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదాయం పడిపోవడానికి విధానపరమైన లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. ప్రభుత్వంతో వ్యాపారానికి మల్టీ నేషనల్‌ కంపెనీలు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందాలు చేసుకోడానికి వెండర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.కాంట్రాక్టులు దక్కిన నాటి నుంచి బిల్లులు చెల్లించే సమయానికి లాభాల మాట అటుంచితే వడ్డీలు పెరిగిపోతున్నాయనే ఆందోళన ఆ వర్గాల్లో ఉంది. ఓ వైపు పన్ను వసూళ్లలో ఉద్యోగుల నిర్లక్ష్యం, చేతివాటం, మరోవైపు ప్రభుత్వంతో వ్యాపారం లేకపోవడంతో ఖజానాకు గండిపడుతోంది.సంక్షేమ పథకాలను అమలు చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలను గాడిన పెట్టడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే కనీసం మొదటి రెండేళ్లు పూర్తిగా అప్పులపై నడవక తప్పని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలంటే 2019నాటికి కాంట్రాక్టర్లకు దాదాపు రూ.9వేల కోట్ల రుపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది.వాటిలో కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప ఆ పనులు తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేవు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యార్థినులకు ఉచితంగా అందించే శానిటరీ నాప్‌కిన్స్‌ సప్లై చేసిన బహుళజాతి కంపెనీకి రూ.2.70కోట్ల రుపాయలు ఐదేళ్లుగా చెల్లించలేదు. దీంతో ఆ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు పెట్టుకోవద్దని డిస్ట్రిబ్యూటర్లపై ఆంక్షలు విధించింది.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిన పడాలంటే దానికి ప్రభుత్వం చాలా తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, పెట్టుబడులకు ఖచ్చితమైన భరోసా, పరిశ్రమలకు సురక్షితమైన వాతావరణం, ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన రాజకీయ వాతావరణం కూడా అత్యవసరంగా కనిపిస్తోంది. రాజకీయాలతో పాటు శాంతిభద్రతలు కూడా రాష్ట్రాన్ని గాడిన పెడితేనే ఏపీ అభివృద్ధి బాటలో నడవగలుగుతుంది.

Related Posts