YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ

అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్ఁ

హైదరాబాద్, జూలై 23,
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో ముందుగా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. జూలై 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు బిజీబిజీగా ఉన్నారు. 25న అసెంబ్లీకి హాజరై తెలంగాణ బడ్జెట్‎ను ప్రవేశ పెట్టనున్నారు  ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అదే రోజు అసెంబ్లీకి వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే లాస్యనందిత మృతికి సభ్యులు సంతాపం తెలపనున్నారు.గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ప్రతిపక్షపాత్రకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుకు తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరగడం, వైద్యులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఆయన లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలు సాగాయి. కేటీఆర్, హరీష్‌ రావులే సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులను తమదైన శైలిలో మాటలతో ఎదుర్కొన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగేసరికి దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‎కు ఎమ్మెల్యేల బలం కూడా తగ్గుతోంది. త్వరలో బీఆర్ఎస్సీఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెబుతున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో అన్నీతానై తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు అసెంబ్లీనే వేదిక చేసుకోనున్నారు కేసీఆర్ అని అంటున్నారు పార్టీ శ్రేణులు. మరి కేసీఆర్ రాకతో అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయో అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.

Related Posts