బీజేపీ జాతీయ అధ్యక్షుడుఅమిత్ షా, ప్రధాని నరేంద్ర మోది లవి అహంభావ రాజకీయాలంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. భాగస్వామ్య పక్షాలకు బిజెపి ద్రోహం చేసింది.మళ్లీ ఇప్పుడు వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ బైటకు వచ్చాక భాగస్వాముల ప్రాధాన్యత బైటపడిందని అన్నారు. ఇక పుట్టగతులు ఉండవనే ఉధ్దేశంతోనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా బిజెపి వ్యవహరిస్తోందని అన్నారు. సీనియర్ అయిన అద్వానీని అవమానించారు,మురళీ మనోహర్ జోషిని అగౌరవపరిచారు. అమిత్ షా,మోది అహంభావ రాజకీయాలు చేశారని విమర్శించారు. గడపగడపకు బిజెపి నేతల తిరుగుడే ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనం. అద్వానీ, జోషి ఇళ్లకు అమిత్ షా,అద్వానీ తిరుగుళ్లు,శివసేన,జెడి(యూ),అకాలీదళ్ చుట్టూ ప్రదక్షిణలు బిజెపి ప్రస్తుత దుస్థితికి ప్రతిబింబమని అన్నారు. భాగస్వామ్య పక్షాలకే కాదు,దేశ ప్రజలకు ఎంత దూరం అయ్యారో దీనినిబట్టే తెలుస్తోంది. బిజెపిమీద ఆర్చి బిషప్ లు తిరగబడ్డమే వారి వైఫల్యాలకు నిదర్శనమని యనమల అన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాతీర్పును కాలరాయాలని చూశారు.కైరానా ఎంపి స్థానం ఉపఎన్నిక ఫలితమే దానిని ఎండగట్టింది. రైతులకు,మహిళలకు,యువతకు బిజెపి పూర్తిగా దూరం అయ్యింది. ప్రజలకే కాదు భాగస్వామ్య పక్షాలకు బిజెపి నమ్మకద్రోహం చేసిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపిల రాజీనామాల డ్రామా క్లైమాక్స్ కు చేరింది.ఉప ఎన్నికలు రాకుండా చేయడంలో వాళ్లు కృతకృత్యులు అయ్యారని యనమల అన్నారు. ఉప ఎన్నికలంటేనే వైసీపికి భయం పట్టుకుంది అనేది దీనితో వెల్లడైంది. బిజెపి మరియు వైసీపి ఇమేజి దిగజారడంతో వాళ్లు బెంబేలెత్తారు. కేంద్రాన్ని సంప్రదించాకే ఎన్నికల సంఘం ఉపఎన్నికల తేది ప్రకటించడం రివాజు. కాబట్టి బిజెపి,వైసిపి కలిసి ఆడిన ఈ ‘రాజీడ్రామా’ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని వ్యాఖ్యానించారు.