హైదరాబాద్
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫర్నిచర్ తయారీ గోదాంలో 20 మంది ఉన్నారు. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక బాగా ఇబ్బందిపడ్డారు. అధికారులు నిచ్చెన ద్వారా వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. 20 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫర్నిచర్ తయారీ గోదాంలో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.