YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి

ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి

హైదరాబాద్, జూలై 24
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తుంది. అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న 7కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టుకోగా.. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఇద్దరు డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు.ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంపై సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడించారు. కాలేజీలు, స్కూళ్లు, పబ్స్ అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్, గంజాయి యథేచ్ఛగా యూత్ వాడేస్తోందని ప్రెస్ నోట్ రిలీజ్‌ చేశారు తెలంగాణ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. పలు కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో ఆరుగురు జూడాలు గంజాయితో పట్టుబడ్డట్లు చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్‌ కౌన్సిల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే గురునానక్‌ ఇంజనీరింగ్ కాలేజీలో 15మంది గంజాయి తీసుకున్నట్లు ఎంక్వైరీలో 
తేలిందన్నారు. సింబయోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుపడ్డట్లు తెలిపారు.అంతేకాదు సీబీఐటీ కాలేజీలో ఓ విద్యార్థికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు పోలీసులు. త్రిబుల్ ఐటీ బాసర లాంటి సంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడినట్లు గుర్తించారు. త్రిబుల్ ఐటీ బాసర కు నాందేడ్ నుండి గంజాయి వస్తున్నట్లు గుర్తించామన్నారు. జోగిపేట జేఎన్‌టీయూలో ముగ్గురు గంజాయితో పట్టుబడగా.. ఇండస్ స్కూల్‌తో పాటు సీబీఐటీకి చెందిన స్టూడెంట్స్ ఈ-సిగరేట్లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణపై విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు 
పోలీసులు. స్కూల్స్, కాలేజీలు ఆవరణలో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీ చేస్తున్నామని, స్కూల్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జువైనల్ ఆక్ట్ పెడుతున్నట్లు తెలిపారు. సెలబ్రిటీలు చిరంజీవి, సుమన్, పీవీ సింధు లాంటి వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పబ్‌ల్లో డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టి.. మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అధికారులు. డ్రగ్స్ అరికట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్నికల్ సహకారంతో డ్రగ్స్ ముఠాల ను వెంటాడుతున్నామని తెలిపారు అధికారులు. ఇక డ్రగ్స్ కి హాట్స్పాట్ గా మారిన పబ్బులపై నిరంతర తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Related Posts