నాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన నేటి సీఎం కెసిఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం సహా తాను సైతం నాడు తెలంగాణ కోసం పదవీ త్యాగాలు చేశామని, పదవుల కోసం పాకులాడలేదని, తెచ్చిన తెలంగాణ తెర్లు కాకుండా, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే అనేక అద్భుత పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం మోతీ ఘనాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో ముఖాముఖి చర్చించారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడుతూ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన-రైతు బంధు పథకం కింద పంటల పెట్టుబడి చెక్కుల ఎలా ఉందంటూ ప్రశ్నించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటల పెట్టుబడి పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్య్రానంతరం ఒక్కసారి కూడా భూ ప్రక్షాళన జరగలేదన్నారు. గతంలో నిజాం కాలంలో ఒకసారి భూ ప్రక్షాళన జరిగిందన్నారు. సీఎం కెసిఆర్ చేపట్టిన ప్రతీ పథకం అద్భుతంగా ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందన్నారు. అయితే, నాడు తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన కెసిఆరే సీఎం అవడం, ఆయనకు రాష్ట్రం మొత్తం సమస్యల మీద అవగాహన ఉండటం వల్ల అభివృద్ధి సాధ్యపడుతున్నదన్నారు. బంగారు తెలంగాణ సాధించి తీరుతామని చెప్పారు. నాడు ఉద్యమం సమయంలో కెసిఆర్ మాట మీద తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామన్నారు. అలాగే కెసిఆర్ సైతం అనేక సార్లు పదవీ త్యాగం చేశారని చెప్పారు. తామేనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. త్యాగాల పునాదుల మీదే తెలంగాణ సాధించామని వివరించారు. అనంతరం మంత్రి కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. భూ ప్రక్షాళన కార్యక్రమంపై రైతులకు వివరించారు. ఇంకా సమస్యలుంటే వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని రైతులకు చెప్పారు. చెక్కుల రాలేదని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఆఖరు పౌరుడికి ఏదో ఒక ప్రభుత్వ పథకం అందేలా తెలంగాణ పథకాలున్నాయన్నారు.