YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదమే

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదమే
తమ రాజీనామాలను ఆమోదించినట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రకటించారు. బుధవారం రోజున స్పీకర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ ప్రకటన చేశారు. ఏప్రిల్ ఆరున తాము ఇచ్చిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని స్పీకర్‌కు మరోసారి స్పష్టం చేశామని, ప్రత్యేకహోదా డిమాండ్ తో ఈ రాజీనామాలు చేసినట్టుగా వివరించామని ఎంపీలు పేర్కొన్నారు. స్పీకర్ ధ్రువీకరణ పత్రాలను అడిగారని.. తాము అందచేస్తామని.. ఇంతటితో తమ రాజీనామాలు ఆమోదం పొందినట్టే అని వారు వివరించారు.మరి వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయా? అనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. రాజీనామాలు చేసిన వారిలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ రాజమోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ఉన్నారు. వీరి రాజీనామాల ఆమోదంతో.. ఈ స్థానాలకు ఎంపీలు లేకుండా పోతారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పాలి. అయితే కచ్చితంగా వస్తాయా? అంటే కొంతమంది ఔను అని, మరికొందరు కాదు అని అంటున్నారు. ఏ నియోజకవర్గానికి అయినా ఆరు నెలల్లోపు ఎంపీ ఉండాల్సిందే అని నిబంధన ఉందని.. దీని ప్రకారం పై ఐదు ఎంపీ స్థానాలకూ బై పోల్స్ వస్తాయని కొంతమంది అంటున్నారు. అయితే ఉప ఎన్నిక ద్వారా ఎన్నికైనా ఎంపీకి కనీసం ఏడాది పాటు అయినా పదవీ కాలం ఉంటుందంటేనే బై పోల్ జరుగుతుంది అని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఎలాగూ లోక్‌సభ సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. వచ్చే ఏడాది మార్చినెలాఖరు కళ్లా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అంటే మరో పది నెలల్లో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. కాబట్టి.. ఇంతలోనే బైపోల్ నిర్వహించే అవకాశాలు లేవనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇదంతా ఎన్నికల సంఘం విచక్షణ మీద ఆధారపడి ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇక ఏం జరుగుతుందో!

Related Posts