YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దంచి కొడుతున్న వానలు

దంచి కొడుతున్న వానలు

ముంబై, జూలై 27
ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. పుణెలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి చెందారు.ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నడుము లోతు నీళ్లు రావడంతో జనం నరకయాతన పడుతున్నారు. చాలాచోట్ల సబ్‌వేల్లోకి నీళ్లు చేరాయి. గుజరాత్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. పోర్‌బందర్‌, సూరత్‌, జునాఘడ్‌ , వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గుజరాత్‌లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది.దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీలోని సీపీ ఔటర్ సర్కిల్, మోతీబాగ్, రింగ్ రోడ్‌ ప్రాంతాల్లో.. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలవడంతో..ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ కులూ జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో మనాలీ-లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు.  ఉత్తరాదిన భారీ వర్షాలతో జనజీవితం స్తంభించింది. ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పవిత్ర పుణ్యభూమి ఉత్తరాఖండ్‌ అస్తవ్యస్థంగా మారింది. కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నిలిపివేశారు అధికారులు.గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్‌ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. వరదల కారణంగా మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయానికి వెళ్లిన భక్తులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Related Posts