ధూల్ పేట లో పునర్నిర్మించిన కొత్త ఎక్షైజ్ స్టేషన్ ను మంత్రి పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వివిధ కారణాల వల్ల గుడుంబా తయారీ, విక్రయ కార్యకలాపాల్లో భాగస్వామ్యులైన వారిని గుర్తించామని వారికీ పునరావాసాన్ని కల్పించే భాద్యత ప్రభుత్వమే స్వీకరించిందని తెలిపారు. రూ. 2 లక్షల మేరకు ఆర్దిక సాయాన్ని అందిచేల ఏర్పాట్లు జరిపామని తెలిపారు. ధూల్ పేట పరిసరాల్లో ఖాళీ స్థలాన్ని గుర్తించి ఏదైనా పరిశ్రమని స్థాపించడం ద్వారా చాలా మందికి శాశ్వతంగా ఉపాధిని కల్పించవచ్చని భావిస్తున్నామని మంత్రి పద్మారావు గౌడ్ వివరించారు. ఈ తరహ ప్రతిపాదనలకు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం సుముఖంగా ఉన్నారని తెలిపారు. గుడుంబా మహమ్మారిని పారాద్రోలిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మానవతా దృక్పదంతో తమ ప్రభుత్వం వ్యవహరించి పునరావాసాన్ని సైతం కల్పిస్తోందని తెలిపారు. ఏ పరిస్థితులలోను గుడుంబాను తయారీ చేయడం కానీ అమ్మడం కానీ ధూల్ పేటలో జరగకూడదని అన్నారు.టిఎస్బిసిఎల్ ఛైర్మన్ దేవి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్, అడిషనల్ కమిషనర్ రాజశేఖర్ రావు, జాయింట్ కమిషనర్ అజయ్ రావు, OSD డాక్టర్ రాజేశ్వర్ రావు, కార్పొరేటర్ ముకేశ్ సింగ్, పరమేశ్వర్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.