హైదరాబాద్
ఓ వీధి కుక్క స్వైర విహారం చేస్తూ, రోడ్డు పై కనిపించిన ప్రతి ఒక్కరినీ కరుస్తూ వెళ్లిన సంఘటన బాలానగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం ఈ రోజు మధ్యాహ్న సమయంలో ఓ వీధి కుక్క మొదటగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడి పై దాడి చేసింది. బాలుడిని కుక్క నుండి కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అదే కుక్క సాయి నగర్, వినాయక్ నగర్, రాజు కాలనీలలో తిరుగుతూ మొత్తం 16 మందిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దాడికి గురైన వారిలో ఏడాదిన్నర వయస్సు నుండి 16 ఏళ్ళ వయస్సు చిన్నారులు, బాలురు ఉన్నారు . వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో ఓ కుక్క 10 మంది పై దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.