YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రధసారధి కోసం కమలం కసరత్తు

రధసారధి కోసం కమలం కసరత్తు

హైదరాబాద్, ఆగస్టు 2
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథిపై అధిష్టానం కసరత్తు తుది దశకు చేరింది. కొత్త, పాత వివాదంతో చాలా రోజులుగా తెలంగాణ కమలదళం నలిగిపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కమలదళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో అధికారం సాధ్యమని భావిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కార్యకర్తలను గెలిపించుకుంటామని బీజేపీ ఎంపీలు.. శపథం చేశారు. ఆలోచన ఘనంగానే ఉన్నా.. కార్యక్షేత్రంలో కమలనాథుల అడుగు ముందుకు పడలేదు.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడ్డారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ తోపాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కల్వకుర్తి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆచారి అధిష్టానం ముందు తమ విన్నపాలు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే షార్ట్ లిస్ట్ తయారుచేసి అభిప్రాయసేకరణ కూడా పూర్తి చేసింది బీజేపీ హైకమాండ్.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. తాజాగా లోక్ సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు రెడ్డిలకు కాకుండా ఇతర వర్గాలకే కేటాయించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆల్రాడీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. ధర్మపురి అరవింద్ కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.ఇక, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ హైకమాండ్ సంకేతాలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. పార్టీలో కొత్త, పాత వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ నేతగా పరిగణిస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. అంతేకాదు.. ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ సమయం దొరికిన ప్రతీ సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటున్నారు.మరోవైపు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు… బీజేపీ హైకమాండ్ అశీస్సులు పొందడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సంఘ పరివార క్షేత్రాల నేతలంతా రామచందర్ రావుకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త, పాత వివాదం తలెత్తిన నేపథ్యంలో పార్టీలో సీనియర్ నాయకుడిగా, అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే నేతగా రామచందర్ రావుకు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చ సాగుతోంది. మొత్తంగా బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Related Posts