దేశంలో కొన్నిరోజులుగా నిఫా వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. కేరళ వాసులైతే టెన్షన్ తో గడుపుతున్నారు. ఈ టెన్షన్ కేరళకే పరిమితంకాలేదు. దేశంలోని పలు ప్రాంతాలను చుట్టేస్తోంది. దీంతో నిఫా వైరస్ లక్షణాలు, ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. నిఫా వైరస్ ను 1998లో మలేసియాలోని నిఫా ప్రాంతానికి చెందిన రోగుల్లో తొలిసారి కొనుగొన్నారు. నాటి నుంచి ఈ వైరస్ ను నిఫాగా వ్యవహరిస్తున్నారు. 2004లో బంగ్లాదేశ్లో కూడా ఈ వైరస్ ప్రబలి, పలువురు మృత్యువాతపడ్డారు. అనంతరం మనదేశంలో పశ్చిమబెంగాల్లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్ వెలుగు చేసింది. ప్రస్తుతం ఈ వైరస్ కేరళలోకి ప్రవేశించింది. నిఫా కారణంగా కేరళలో 14 మంది మరణించారు. వీరిలో ఓ నర్సు కూడా ఉంది. మరో 20 మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వీరిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోజికోడ్, మలపురం జిల్లాలో ఇటీవల పలువురు విషజ్వరాల బారిన పడ్డారు. వీరి రక్తనమూనాలను పుణెలోని నేషనల్ వైరాలజి ఇన్స్టిట్యూట్కు పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరంతా ప్రమాదకర నిఫా వైరస్ బారిన పడినట్లు తేలింది. దీంతో అక్కడ ప్రజల్లో భయాందోళనలు అలముకున్నాయి.
గబ్బిలాలు, పందుల తదితర జంతువుల ద్వారా నిఫా వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ భారత్ లో ప్రవేశించడంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇక జాతీయ వ్యాధి నియంత్రణకు చెందిన ఉన్నతస్థాయి వైద్యబృందం సైతం కేరళలో పర్యటించి వ్యాధి తీవ్రతపై నివేదికలు పంపారు. ఇదిలాఉంటే నిఫా బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఆ వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటుంది. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్సెఫలైటిస్, మయోకార్డైటీస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. ఈ డెడ్లీ వైరస్ను అరికట్టడానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సీను, ఔషదాలు అందుబాటులో లేవు, అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినప్పుడు అందించిన చికిత్సనే నిఫా వైరస్కు ఇస్తున్నారు. వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం, ఇంటితో పాటు ఇంటిలోని వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తినేఆహారం, నిత్యవసర వస్తువులపై తప్పనిసరిగా మూతలు వేసి ఉంచాలి. నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లను ఆరగించాలి. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి లాంటి జంతువులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.