YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ద్రవ్యలోటు 2,800 కోట్లు...

తెలంగాణలో ద్రవ్యలోటు 2,800 కోట్లు...

హైదరాబాద్, ఆగస్టు 3,
సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం, 2023-24లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్‌డిపి 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం రాబడి పెరిగిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం పెరగ్గా, సొంత పన్నుల రాబడి గణనీయంగా 17శాతం పెరిగిందని తెలిపింది.సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని, 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని కాగ్ ఈ నివేదికలో వెల్లడించింది. రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కాగ్ వివరించింది. ఎపి నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని ఈ నివేదికలో తెలిపింది. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్‌ఫాం పథకాల నిధులను ఖర్చు కాలేదని కాగ్ స్పష్టం చేసింది. దళితబంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపులకు సంబంధించి ఖర్చు కాలేదని కాగ్ వెల్లడించింది.2022-, 23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్సు 150 శాతం పెరిగాయని, సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని కాగ్ తెలిపింది. 2022-, 23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా కాగా, ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించిందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారని కాగ్ ఈ నివేదికలో పేర్కొంది.బడ్జెట్ నిర్వహణ, ఇతర లోటుపాట్లు అధిక ఖర్చు నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో రూ.1,05,565 కోట్ల మొత్తం అధిక వ్యయం అయ్యిందని కాగ్ పేర్కొంది. 2014,-15 నుంచి 2021-,22 వరకు కేటాయింపులకు మించి చేసిన రూ.2,89,115 కోట్ల అధిక వ్యయానికి రాష్ట్ర శాసన సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ పొందడంలో కూడా విఫలమయ్యిందని కాగ్ పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని 204 అధికరణ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. బడ్జెట్ కేటాయింపు లేకుండా ప్రభుత్వం 48 ఉప పద్దుల కింద రూ.8,985 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేసిందని పేర్కొంది.ఉదయ్ కింద డిస్కమ్‌లను నష్టాలను నుంచి బయటకు తీసుకురావడంలో రూ.7,061 కోట్లు ఖర్చు చేసినప్పటికీ శాసనసభ ఆమోదం పొందడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ సూచించింది. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థలో (రూ.122 కోట్లు) పెట్టిన పెట్టుబడులకు శాసనసభ ఆమోదం పొందడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, ఐదు సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభజించదగిన సేవా పింఛనుల ఖర్చును నామమాత్రంగా రూ.50 కోట్ల కంటే తక్కువగా అంచనా వేసిందని, వాస్తవ వ్యయం ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రూ.1,000 కోట్లకు మించి అధికంగా ఖర్చయిందని తెలిపింది. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధి రుణాల మీద వడ్డీపై ఖర్చు నిరంతరం తక్కువగా అంచనా వేసినట్టు పేర్కొంది.2022- 23 సంవత్సరంలో పన్నులు కాని రాబడి నుంచి అందుకోవలసిన మొత్తం రూ.25,422 కోట్లుగా అంచనా వేశారు. కానీ, రాబడి రూ.19,554 కోట్లు అని, ఇందులోనూ, (i) ఇతర రాబడి ద్వారా వచ్చిన రూ.5,723 కోట్ల ఆదాయం ప్రధానంగా డిపాజిటు ఖాతాలను జప్తు చేసినందు వల్ల వచ్చినవేనని కాగ్ తెలిపింది. (ii) ప్రధాన ఖనిజాలపై కప్పం (లేదా ముందుగా ఊహించని ముందస్తుగా చెల్లించిన రాయల్టీ కూడా ఉన్నాయని పేర్కొంది.పన్నులు కానీ రాబడిలో భూమి, ఆస్తి విక్రయం నుంచి రూ15,500 కోట్లు అందుతుందని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం రూ.791 కోట్లు మాత్రమే అందుకుందని, మూడు సంవత్సరాలుగా చూస్తే బడ్జెట్ అంచనాల్లో పన్నులు కాని రాబడి నుండి వచ్చే రాబడి అంచనాలు నిరంతరం ఎక్కువగానే ఉంటున్నాయని కాగ్ పేర్కొంది. కేంద్రం నుంచి సహాయక గ్రాంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.41,002 కోట్ల భారీ మొత్తాన్ని అంచనా వేయగా రూ.13,179 కోట్లు మాత్రమే అందుకుందని కాగ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవంగా రూ.25,555 కోట్లు ప్రత్యేక ప్యాకేజీగా, అదనపు కేంద్ర సహాయంగా అందుతుందని అంచనా వేయగా, ఇది భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనల్లో కనబడలేదని, 2022,-23 సంవత్సరానికి అందలేదని కాగ్ పేర్కొంది.

Related Posts