YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ, బీఆర్ఎస్ విలీనం సాధ్యమేనా

బీజేపీ, బీఆర్ఎస్ విలీనం సాధ్యమేనా

హైదరాబాద్, ఆగస్టు 9
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య విలీన చర్చలు జరుగుతున్నాయని డీల్ ఫైనల్ అయిపోయిందని విస్తృత ప్రచారం ప్రారంభమయింది. గత నాలుగుదు నెలలుగా ఈ తరహా ప్రచారం అంతర్గతంగా సాగుతోంది. కానీ ఎవరూ స్పందించలేదు.  ఇప్పుడు ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఖండించారు. ఓ ట్వీట్‌ ద్వారా వీలైనంత బలంగా విలీనం ప్రచారం కుట్ర పూరిత ప్రచారం అన్నారు కానీ.. ఆ వాదనలో బలం ఉందని రాజకీయవర్గాలు భావించడం లేదు. బీఆర్‌ఎస్ పార్టీ విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అందుకే ఎక్కువ మంది విలీన చర్చలు నిజమేనని అనుకుంటున్నారు. గత నెలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. కొన్ని కీలక సమావేశాలు ఉన్నప్పటికీ వారు ఢిల్లీలో మకాం వేశారు. దాదాపుగా వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఎవరితో సమావేశమయ్యారో ఎవరికీ తెలియదు. వారు కూడా చెప్పలేదు. వీరి ఢిల్లీ టూర్‌పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. రేవంత్ రెడ్డి అయితే పార్టీని తాకట్టు పెట్టడానికి వెళ్లారని విమర్శించారు. బీజేపీ నేతల కోసం పడిగాపులు పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఒక్క రోజు కొంత సేపు కవితతో తీహార్ జైల్లో ములాఖత్ అయ్యారు. మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారో .. ఎవరితో సమావేశం అవుతున్నారో స్పష్టత లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయించేందుకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లుగా ఓ సారి ఫోటో రిలీజ్ చేశారు. అందు కోసం రోజుల తరబడి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వీరు  బీజేపీ పెద్దలతో రహస్యంగా విలీన ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నారన్న బలమైన సమాచారం బయటకు రావడంతో కొంత మంది నేరుగా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి విలీనం చర్చలు జరగకపోతే.. ఈ విషయాన్ని ఖండించడానికి  రెండు పార్టీలు ఎందుకు తటపటాయిస్తున్నాయన్నది రాజకీయవర్గాల నుంచి వస్తున్న మొదటి ప్రశ్న. నిర్మోహమాటంగా ఖండించడానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దంగా లేరు. కీలక నేతలు ప్రతి రోజూ  తెలంగాణ భవన్ లో ప్రెస్మీట్లు పెడుతున్నారు కానీ.. బీజేపీతో పొత్తు లేదా విలీనం అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. కేటీఆర్ కూడా ఓ ట్వీట్ పెట్టారు కానీ.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పడం లేదు. తెలంగాణ కోసం పోరాడతామని చెబుతున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ ద్వారానేనా అన్నదానిపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నట్లుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ మత్రమే కాదు.. అసలు బీజేపీ కూడా స్పందించడం లేదు. బీజేపీ నేతలు స్పందించినా కాస్త క్లారిటీ ఉండేది. కానీ స్పందించడానికి  వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు. అంటే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ఢిల్లీలో ఏదో జరుగుతోందని సులువుగా అర్థమైపోతుంది. స్వయంగా మజ్లిస్ పార్టీ చీఫ్ అసుద్దన్ కూడా ఈ అంశంపై బీఆర్ఎస్‌ను ప్రశ్నించినా స్పందన లేదు. నిజానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు లేదా విలీనం అంశంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని బీఆర్ఎస్సే నేరుగా ప్రతిపాదన పెట్టినా.. తెలంగాణ బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే డీల్ ఆలస్యమవుతోందని ఢిల్లీ వర్గాలు గట్టిగా చెబుతన్నాయి. బీఆర్ఎస్‌తో తీవ్రంగా పోరాడిన ముగ్గురు ఎంపీలు  ఆ  పార్టీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా సరే అది బీజేపీకి నష్టం చేస్తుందని గట్టిగా వాదిస్తున్నారని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ బలం.. బీజేపీకి కలసి వస్తుందని.. కింది స్థాయి వరకూ పార్టీ నిర్మాణం ఏర్పడుతుందని ..  ఇతర సీనియర్ నేతలు పాజిటివ్‌గా స్పందిస్తున్నారని అంటున్నారు. ఈ  కారణంగానే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని వ్యతిరేకించే వారిని ..  సముదాయించి అధికారిక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం.. అలాంటి పరిస్థితి రాదని.. కేసీఆర్ తన పార్టీని ఇతర పార్టీల్లో కలిపేంత నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ ఓ రకంగా శూన్యం నుంచి పుట్టించారు. పిడికెడు మందితో ప్రస్థానం ప్రారంభించారు. అలాంటి పార్టీని ఆయన దేశంలోనే ప్రముఖ ప్రాంతీయ పార్టీగా మార్చారు. మరి ఇప్పుడు ఒక్క ఓటమికే ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా ? అని ఆలోచిస్తే.. చాన్సే ఉండదని ఎవరికైనా అర్థమవుతుంది.   ప్రధాన ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీనే. దాదాపు39 శాతం ఓట్ షేర్ సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో.  రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే కచ్చితంగా 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం.  అదే సమయంలో బీఆర్ఎస్‌కు నాయకత్వ సమస్య లేదు.  కేసీఆర్ మళ్లీ మైక్ పట్టి..రోడ్లపైకి వస్తే ఆయన క్రేజ్ ఆయనదే. ఇంకో 10 పదేళ్లు ఆయన యాక్టీవ్ పాలిటిక్స్ ఉండగలరు.  నీ భవిష్యత్ లీడర్లు గా ఒకరు కాదు ఇద్దరు కనిపిస్తున్నారు. హరిశ్ రావు, కేటీఆర్ లు ఆల్ రెడీ ఫ్రూవెన్ లీడర్స్. కేసులు.. ఆర్థిక  పరిస్థితి ఇలా ఏం చూసినా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం అనే సమస్యే ఉండదని బీఆర్ఎస్ క్యాడర్ గట్టి నమ్మకం.ఓ వైపు క్యాడర్.. మరో వైపు పార్టీ భవిష్యత్ మద్య బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఊగిసలాడుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని అనుకోవచ్చు

Related Posts