హైదరాబాద్, ఆగస్టు 14,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పాలనలో తనదైన శైలిని చూపుతున్నారు. మంత్రి పదవి కూడా చేపట్టకుండా సీఎం పదవి దక్కించుకున్న రేవంత్.. ఇటు ప్రజల్లో.. అటు అధిష్టానం దృష్టిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మామీలు అమలు చేస్తూ.. ప్రజలకు దగ్గరవుతున్నారు. రుణమాఫీతో రైతులకు మరింత దగ్గరయ్యారు. ఫ్రీ బస్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ కారణంగా మహిళల మన్ననలు అందుకున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నారు. ఇక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకే చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఆపరేషన్ ఆకర్ష్లో మొదట కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ టికెట్పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం.. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఉంటారన్న ముద్ర ఉంది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే హస్తం నేతలతో టచ్లోకి వచ్చారు. సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.. వచ్చి గాంధీ భవన్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ప్రస్తుతం దానంపై అనర్హత పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా దానం నాగేందర్కు సీఎం రేవంత్రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఓ ఇంటి గోడను కూల్చిన కేసులో దానంపై కేసు నమోదుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అధికారం కోసం పాకులాడే నేతల్లో మొదటి వ్యక్తి దానం నాగేందుర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ నేతృత్వంలో దానంకు కాంగ్రెస్ టికెట రాలేదు. దీంతో మరుసటి రోజే టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు. కానీ, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో నెలకే దానం.. తిరిగి నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ను కలిశారు. కాంగ్రెస్లో చేరతానని వేడుకున్నారు. వైఎస్సార్ రాజనీతి మేరకు ఎమ్మెల్యే పదవికా రాజీనామా చేసి రావాలని సూచించారు. దీంతో రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయినా వైఎస్సార్ దానం నాగేందర్ను దగ్గరుండి చూసుకున్నారు. అప్పట నుంచి హైదరాబాద్లో దానం దందాలు మొదలు పెట్టారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ పదేళ్లు ఉండి.. దందాలు కొనసాగించారు. ఇక గతేడాది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇక్కడ మళ్లీ స్వేచ్ఛగా దందాలు మొదలు పెట్టారు.ఇక దానం రూల్స్ విభిన్నంగా ఉంటాయి. దండాలు పెట్టించుకోవడం దాదాగిరి చేయడం ఆయనకు ఇష్టం. అందుకే న్యాయం చేయాలని ఎవరు ముందు వస్తే వారికే న్యాయం చేస్తాడు. కబ్జాకోరే వచ్చి న్యాయం చేయాలన్నా.. బాధితులకు ధమ్కీ ఇస్తాడు. ముందు వచ్చినవాడితే న్యాయం అని నమ్ముతాడు. ఈ క్రమంలోనే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో ఉన్న కాంపౌండ్ వాలన్ ను కూల్చి వేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దానంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీఎంవోను సంప్రదించారు. వారు సీఎం రేవంత్రెడ్డితో జరిగిన విషయం చెప్పారు. వెంటనే కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఖెరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 69లోని నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మ నగర్ కాలనీలో 800 గజాల స్థలంలో ఉన్న ప్రహరీ గోడను దానం నాగేందర్ అనుచరులు కూల్చివేశారు. ఆయన అనుచరులు గోపాల్ నాయక్, రాంచదర్ ఈ గోడను కూల్చి వేయించారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నేను లోకల్ అంటున్న దానం
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందన్నారు. అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు దానం. నందగిరి హిల్స్ హుడా లేఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిసి తాను అక్కడికి వెళ్లానని దానం చెప్పారు. అక్కడ జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజేషన్ నోటీసులు ఇస్తానని దానం నాగేందర్ చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గతంలోనూ తనపై కేసులు పెట్టారని, ఇప్పటి కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. పేదల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానన్నారు.అంతకుముందు నంది హిల్స్ ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మ నగర్ కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ నాయక్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దానం నాగేందర్ ను ఏ-3గా పోలీసులు చేర్చారు.