హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బోగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పేదలకు సొంతింటి కల సాకారమయ్యేలా పీఎం ఆవాస్ యోజన పథకం తెలంగాణలోని పేదలందరికీ అందేలా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి సర్వేలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇది మార్చి, 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని భూమిలేని పేద కుటుంబాల కోసం 2.95 కోట్ల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. 09.08.2024న జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో రెండో దశలో భాగంగా 2024 నుంచి 2029 మధ్య పేద కుటుంబాలకు అదనంగా 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల అవసరం ఉన్న కనీసం 10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.