తెలంగాణ సాగు నీటి శాఖ దేశానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ లో సోషల్ ఇంజనీర్ గా పని వ్యవహరిస్తే... క్షేత్ర స్థాయిలో సాగు నీటి శాఖ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సైనికుల్లా పని చేశారని ప్రసంశించారు. సాగు నీటి శాఖ పని తీరుపై మనకు మనమే చెప్పుకుంటే బాగుండదని, రైతుల పొలాలకు నీరు ఇచ్చినపుడే ఈ శాఖకు సార్థకతకు చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాగార్జున సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందుతుందని...మేం పంటలు వేసుకోగలుగుతున్నామని సూర్యపేటకు చెందిన వెంకటరెడ్డి అనే రైతు ఇదే వేదికపై చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. తమ శాఖ సాధించిన విజయం రైతు మాటాల్లోనే తెలిసిందన్నారు. నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా తమ ఇంజనీర్లు నిర్వహించడం వల్ల ఈ నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వగలుగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆయా శాఖల మధ్య సమన్వయం, క్షేత్ర స్థాయిలో ఇంజనీర్ల కృషి సాగునీటి శాఖలో చక్కటి ఫలితాలకు కారణమని మంత్రి హరీష్ రావు విశ్లేషించారు. ఒక టీఎంసీకి ఐదు వేల నుంచి ఆరువేల ఎకరాలు మాత్రమే సాగు చేసేవారు. కాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది ఒక టీఎంసీకి 11796 ఎకరాల సాగు జరిగింది. 4.4 టీఎంసీల ద్వారా 5.25 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చినట్లు చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, పోచంపాడ్ ద్వారా నీటి చివరి కాలువ వరకు నీరు ఇస్తున్నామన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీతో 13021 ఎకరాలకు నీరందించి కొత్త చరిత్ర సృష్టించినట్లు హర్షధ్వానాల మధ్య మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పోచంపాడు ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీకి 9,650 ఎకరాల సాగు చేయడం విశేషమని చెప్పారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి, టేల్ టూ హెడ్ పద్ధతి ద్వారా చివరి భూములకు నీరందించగలిగినట్లు మంత్రి చెప్పారు. దీని వల్ల పంటల దిగుబడి పెరిగిందన్నారు. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల ధాన్యం పండించే రైతు... ఈ విధానం అమలు చేయడం వల్ల ఎకరానికి 50 నుంచి 55 బస్తాలకు దిగుబడి పెరిగినట్లు చెప్పారు. నీళ్ల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయకుండా పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి గతంలో లేదన్నారు. కాని ఒక్క ధర్నా, రాస్తారోకో చేయకుండా రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ కే చెల్లిందన్నారు. గత అసెంబ్లీ చరిత్ర పరిశీలిస్తే... ప్రతిపక్షాలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవి. కాని బడ్దెట్ సమావేశాల్లో అలాంటి డిమాండ్ ప్రతిపక్షాల నుంచి లేకపోవడమే తమ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. రైతు గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, సాగు నీటి శాఖ ఇంజనీర్లు నిలిచిపోయారని కొనియాడారు. 25 ఏళ్లలో తొలి సారి గా...24 గంటల నాణ్యమైన విద్యుత్, చివరి ఆయకట్టు భూములకు నీరిచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిదేన్నారు. రాత్రింబవళ్లు పని చేస్తోన్న సాగు నీటి శాఖ ఇంజనీర్ల సమస్యలను సీఎం కేసీఆర్ తో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా ఇంజనీర్లను మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. రాత్రి ఒంటి గంట సమయంలోను కాలువల వద్ద మహిళా ఇంజనీర్లు విధుల్లో ఉండటం గొప్ప విషయమన్నారు. నీటి నిర్వహణ సమయంలో మహిళా ఇంజనీర్లు రాత్రి వేళల్లో పని చేస సందర్భంలో పోలీసు భధ్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సాగు నీటి శాఖలో అవసరమైన వాహనాలు, అధికారాలు కల్పిస్తామన్నారు. జిల్లా , డివిజన్ కమిటీలు వేసి నీటి యాజమాన్య పద్ధతులను మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయితే ఇక నీటి నిర్వహణ మాత్రమే ఉంటుందని మంత్రి ఇంజనీర్లకు చెప్పారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖలతో ముడిపడి ఉన్న శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు. మాకు 60 ఏళ్ల చరిత్ర ఉందని కొందరు చరిత్ర చెబుతారు. కాని సీఎం కేసీఆర్ చెప్పేది ఒక్కటేనన్నారు. ఎన్నేళ్లు పాలించామన్నది కాదు..... ప్రజలకు అవసరమైన పాలన ఎంత మేరకు అందించామన్నదే చరిత్రని సీఎం చెహబుతుంటారన్నారు. మమ్మల్ని విమర్శించే వారి హయాంలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర వంటి ప్రాజెక్టుల పేర్లే పెండింగ్ ప్రాజెక్ట్స్ గా మారాయన్నారు. ఎన్నేళ్ల చరిత్ర ఉంద్నది ముఖ్యం కాదని, రైతులకు ఎమి చేసామన్నదే, ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చామన్నదే ముఖ్యమని చెప్పారు. 4 యేండ్లలలో పెండింగ్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకుపోవడం, రీడిజైన్ ద్వారా ప్రాజెక్ట్స్ నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పకడ్భందీగా ఉత్తమ నీటి యాజమాన్య పద్దతుల అమలు వంటి అంశాలను తమ శాఖ ప్రాధాన్యత అని మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 5.71 లక్షల ఏకరకు నీరు ఇచ్చారు కానీ మేము మా నాలుగేళ్లో పది లక్షల ఎకరాలు ఈ ఏడాదిలో మరో పది లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు చెప్పారు. మొత్తం మా ప్రభుత్వ హయంలో 24 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు చెప్పారు. అరవై ఏళ్లలో సాధించిన ప్రగతిని, ఈ ఐదేళ్లలో తమ సాగు నీటి శాఖ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోను ప్రసంశలందుకుంటోందన్నారు. మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు దీనిపై పరిశోధన చేశారన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రోగ్రాం ప్రారంభించిందని, కర్ణాటక లో బీజేపీ తన మ్యానిఫెస్టోలో మిషన్ కళ్యాణి పేరుతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి చోటిచ్చందన్నారు. ఉమా భారతి బుందేల్ ఖండ్ లో ఇదే పథకాన్ని అమలు చేస్తున్నారని, చెప్పారు. నీతి ఆయోగ్ ప్రసంశలు పొందిన పథకం మిషన్ కాకతీయ అని మంత్రి హరీష్ రావు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వాెరా 12 లక్షల ఏకరాలకు సాగు నీరు ఇచ్చామని, చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు 2 నుంచి 3 మీటర్లు పెరిగిందని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చేపల ఉత్పత్తి పెరిగిందని వివరించారు. పది వేల చెరువులు ఒక ఏడాదిలో బాగు చేయడం ఆషామాషీ విషయం కాదని, ఈ సవాల్ ను తమ ఇంజనీర్లు స్వీకరించి దిగ్విజయం చేశారని ప్రసంశించారు. లోయర్ పెన్ గంగ ఆదిలాబాద్ ప్రాజెక్టు 30 ఏళ్ల నుంచి నానుతోందని... ఇలాంటి ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.