హైదరాబాద్, ఆగస్టు 26,
హైడ్రా..తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలు హైడ్రా కూల్చివేసినప్పటికీ.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చిన తరువాత.. హైడ్రా సెంటర్ ఆఫ్ డిస్కషన్గా మారిపోయింది. హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి ? తరువాత ఎవరి కట్టడాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చబోతున్నాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నో అక్రమణ నిర్మాణాలను హైడ్రా టార్గెట్ చేస్తున్నప్పటికీ.. లిస్ట్లో నెక్ట్స్ ఎవరున్నారే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అటు తెలంగాణ రాజకీయాలు కూడా ఇప్పుడు హైడ్రా చుట్టూ నడుస్తున్నాయి. కాగా హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని విమర్శించారు. నాలుగు రోజుల హీరో అన్నట్లు రేవంత్ హైడ్రామా చేస్తున్నారని.. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల విషయంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు.అటు హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలు ఎఫ్టీఎల్లో కట్టారని.. వాటిని కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని.. మరి దాని పరిస్థితేంటని నిలదీశారు.ఎవరి కామెంట్ ఎలా ఉన్నా.. చెరువులు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టేది లేదని మరోసారి తేల్చేశారు సీఎం రేవంత్. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదన్నారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులు రక్షిస్తామన్నారు. చెరువులు కబ్జా చేసే వారి భరతం పడతామన్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు నిర్మించుకున్నారని.. ఫాంహౌస్ల డ్రైనేజీ కాల్వలను గండిపేటలో కలిపారని ఆరోపించారు.ఇప్పటివరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది. కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని భాజపా నేత సునీల్రెడ్డి, బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, నందగిరిహిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు, చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు.. ఇక ముందు హైడ్రా ఎవరి ఆక్రమణలపై గురిపెడుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.