టీఆర్ఎస్, టీడీపీలు రెండూ.. కాంగ్రెస్ కవల పిల్లలని, కాంగ్రెస్.. టీఆర్ఎస్ రెండు పార్టీలూ భవిష్యత్లో ఏకమయ్యే పార్టీలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు. కాంగ్రెస్తో జట్టు కట్టాలని కేసీఆర్ చెప్పారని కుమారస్వామి వెల్లడించడాన్ని బట్టి చూస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్లు స్పష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.సంగారెడ్డి జల్లా సదాశివపేటలో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ... దేశంలో 2014 నాటికి కేవలం 6 కోట్ల 25 లక్షల మందికి మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని, కానీ ఈ నాలుగేళ్లలో వాటికి అదనంగా 7 కోట్ల 50 లక్షల మందికి మరుగుదొడ్లు కట్టించి వాటికి మహిళల ఆత్మగౌరవాలయాలుగా నామకరణం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత రాష్ట్రలుగా రికార్డు సృష్టించాయని, అలాగే 3 లక్షల 65 గ్రామాలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా చరిత్ర సృష్టించడం నిజంగా గుణాత్మకమైన మార్పు అని అన్నారు.
మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అమలు చేసిన వివిథ అభివృద్ధి పథకాలతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకే చేరాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా 32 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా వారికే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకంలో భాగంగా అనుకోని ప్రమాదం జరిగితే పేద కుటుంబాలను ఆదుకునేందుకు కేవలం బీమా వర్తింప చేస్తున్నారని, సుకన్య యోజన పథకం ద్వారా నెలకు వేయి రూపయాలు చెల్లిస్తే... అమ్మాయి పెళ్లీడు వచ్చేనాటికి 6 లక్షల 50 వేల రూపాయలు చెల్లిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. అలాగే వంటింట్లో కట్టెలపొయ్యితో పేదలు కష్టాలు పడకూడదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని అమలు చేస్తుందని, ఇప్పటికే ఉజ్వల పథకంలో భాగంగా దేశంలో 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు, తెలంగాణలో 20 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రతి పేద వాడికి 5 లక్షల వరకు కేంద్రం అందిస్తుందని, జనరిక్ మందులకు అతి తక్కువ ధరకే పేదలకు అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలు పండించిన పంటలు.. ప్రకృతి వైఫరిత్యాల వల్ల నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఆదుకుంటున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి 18 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదని, మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 18 వేల గ్రామాల్లో విద్యుత్ వసతి ఏర్పాటు చేసి వేల గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.
పెద్దనోట్ల రద్దు ఫలితంగా కోటి మంది అదనంగా నేడు ఆదాయం పన్ను కడుతున్నారని, నల్లడబ్బు వెలికి తీయడం ద్వారా 90 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరిందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
టెంటు లేని ఫ్రంట్లు ఎన్ని ఏర్పడ్డ.. ప్రజలు బిజెపి వైపే ఉన్నారని, మతతత్వ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీలు...టీఆర్ ఎస్, కాంగ్రెస్, టీడీపీలని, కేవలం ప్రజా క్షేమం కోరి నిజాయతీ, నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ బిజెపి పార్టీ మాత్రమేనని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.
రాబోవు మూడు నెలలపాటు సభలు, సదస్సులు, సమావేశాలతో బిజెపిని తెలంగాణలో బలోపేతం చేస్తామని, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణలో పర్యటించి పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపడుతారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.
ముస్లింలు అధికంగా గల కాశ్మీర్లో బిజెపి అధికారంలో ఉందని, క్రైస్తవులు అధికంగా గల నాగాలాండ్, బౌద్ధులు అధికంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కు జనాభా అధికంగా గల పంజాబ్లోనూ గతంలో బిజెపి అధికారంలో ఉందని, దీనికి మోదీ అభివృద్ధి ఎజెండానే ప్రధాన కారణమని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఆరునూరైనా.. బిజెపి తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ ధీమా వ్యక్తం చేశారు.
పేదరికం నుంచి వచ్చిన, బడుగు బలహీన వర్గానికి చెందిన నరేంద్రమోదీ ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
అవినీతి, అక్రమాలు, స్కాంలు, కుంభకోణాలతో ప్రజలను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించిందని, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనతో దేశానికి అభివృద్ధి నిరోధకులుగా మారారని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు.
నాలుగేళ్లలో సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాకు కేంద్రం 172 కోట్ల 49 లక్షల రూపాయలను ఇచ్చిందని, స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల కోసం సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీల పరిధిలో 34 కోట్ల 14 లక్షల రూపాయాలు, అలాగే ప్రతి పంచాయతీకి 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 123 కోట్ల 88 లక్షలు, మొక్కలు నాటడానికి 19 కోట్ల 9 లక్షలు, ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద యువత శిక్షణకు 25 కోట్ల 17 లక్షలు కేంద్రం ఇచ్చిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు.
ముఖ్యంగా మోదీ పాలనలో దళితుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి పంచ్తీర్ధ్ పేరిట ఆయన పుట్టిన మౌ గ్రామం మొదులుకుని, చదివిన లండన్, అలాగే దీక్షభూమి నాగ్పూర్, ఢిల్లీ వంటి ప్రదేశాలను తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఓ మేధావిని పార్లమెంటులో అడుగుపెట్టకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్దని, అంబేద్కర్కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్కు మనసు రాలేదని డాక్టర్ లక్ష్మన్ విమర్శించారు. దళితుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇదే అంశాన్ని రాబోవు మూడు నెలల్లో ప్రజల్లో విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేస్తామని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. కాంగ్రెస్ ఏనాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాదు.. కాజాలదని, ముమ్మాటికీ బిజెపి మాత్రమే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని డాక్టర్ లక్ష్మణ్ పునరుద్ఘాటించారు.
కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు బిజెపికి అండగా నిలిచి తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు కంకణ బద్ధులు కావాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.