YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ రెండు చెరువులుపై దృష్టి

ఆ రెండు చెరువులుపై దృష్టి

హైదరాబాద్, ఆగస్టు 27,
తమ్మిడి కుంట చెరువు విస్తీర్ణం 29.6 ఎకరాలు. ప్రస్తుతం అది పది ఎకరాలకు పడిపోయింది. దాదాపు 19 ఎకరాల చెరువు స్థలం కబ్జాకు గురైంది. అందులో కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు. మరి కొంతమంది బహుళ అంతస్తులు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత నేపథ్యంలో వారిలో భయం మొదలైంది. ఇదే సమయంలో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు చెరువుల్లో ఆక్రమణల కూల్చివేత నిరంతరం కొనసాగుతుందని హైడ్రాధికారులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లు చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయించారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత.. తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డి కి సంబంధించిన నిర్మాణాలేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డికి సంబంధించిన పలు నిర్మాణాలపై కోర్టు స్టేలు ఉన్నాయి. కాప్రా లోని మల్లారెడ్డికి సంబంధించిన ఒక నిర్మాణం ఉంది. అయితే దానిపై ఇటీవల స్టే వెకేట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్ అధికారులు సమాయత్తమవుతున్నారు.గత ఏడాది వానా కాలంలో మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి లోకి వాన నీళ్లు వచ్చాయి. అప్పట్లో మల్లారెడ్డి పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు దస్త్రాలను విలేకరులకు అందించారు. మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి కళాశాలలు, ఇతర భవనాలు నిర్మించాలని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసులు కూడా వేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి బహిరంగంగా రేవంత్ రెడ్డికి తొడ కొట్టి సవాల్ విసిరారు. ఆ తర్వాత ఏడాది గడవగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి.. నేలమట్టం చేస్తున్నారు. మల్లారెడ్డి కి సంబంధించినవి ఇవి మాత్రమే కాకుండా మేడ్చల్, ఇతర ప్రాంతాలలో నిర్మించిన కళాశాలలు కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టినవేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అంతకుముందు సంవత్సరం ఐటీ అధికారులు మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికి కోర్టులో విచారణ కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు ఆయన విద్యాసంస్థలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.
వెంకటాపూర్ లో అనురాగ్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటిసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనురాగ్ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్.. మేడ్చల్ జిల్లాలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టాయని నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నెంబర్లు ఈ విద్యాసంస్థలు వివిధ నిర్మాణాలు చేపట్టాయి. అయితే ఆ చెరువుకు 30 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే యాజమాన్యం ఆ నిబంధనను పక్కనపెట్టి నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో ఘట్కేసర్ మండల ఇరిగేషన్ ఏఈ పరమేష్.. ఈనెల 22న బఫర్ జోన్ లోని నిర్మాణాలను పరిశీలించారు. వాల్టా చట్టంలోని పలు సెక్షన్లను పేర్కొంటూ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నంగార భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్ అనురాగ్ విద్యాసంస్థల ఆక్రమణలపై కలెక్టర్, నేటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బఫర్ జోన్ లోనూ నిర్మాణాలు చేపట్టిన అనురాగ్ విద్యా సంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.మరోవైపు హైడ్రా తమ ఆస్తుల విషయంలో పరిధికి మించి జోక్యం చేసుకుంటుందని.. కూల్చివేతలను చేపట్టకూడదని పేర్కొంటూ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇందులో అనురాగ్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, నీలిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి సంస్థలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కురెముల గ్రామంలోని 823/ ఈ, 813/ఈఈ, 813/ఏఏ/2, 813/ ఏ ఏ/ 1796 సర్వే నెంబర్లలో 17.21 ఎకరాల భూమి, ఇతర నిర్మాణాలపై హైడ్రా అధికారులు జోక్యం చేసుకొని.. విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆ విద్యాసంస్థలు ఫిర్యాదుల పేర్కొన్నాయి. హైడ్రా నిలువరించకపోతే.. తమ నిర్మాణాలను పడగొట్టే ప్రమాదం ఉందని ఆ విద్యాసంస్థల బాధ్యులు పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యాసంస్థల ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. నిబంధన ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఈ ప్రకారం ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో కేసు ముగిసింది .మరోవైపు అనురాగ్ విద్యాసంస్థలపై వస్తున్న ఆరోపణలపై ఆ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ప్రభుత్వం ఈ ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో 480 సీట్లలో కోత విధించింది అన్నారు. తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని వాపోయారు. ఇప్పటికే తమ విద్యాసంస్థలపై విజిలెన్స్, ఇంటలిజెన్స్, రెవెన్యూ, నీటిపారుదల, విద్యాశాఖ అధికారులు నిత్యం సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నట్టు కనిపించకపోవడంతో.. నీటిపారుదల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి తమపై మరో కేసు నమోదు చేశారని ఆయన వివరించారు. ఈ కేసు వల్ల తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన వాపోయారు

Related Posts