మెదక్ జిల్లా నార్సింగి బస్ స్టాప్ సమస్యలకు నిలయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బస్సులు నిలిచే చోట సరైన షెల్టర్ ఉండడం లేదని వాపోతున్నారు. దీంతో ఎండకు ఎండుతూ..వానలకు తడుస్తూ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. నార్సింగిలోనే కాదు.. 44వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో తగిన బస్ట్ స్టాప్ లో లేవని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతి పెద్ద జాతీయ రహదారి ఇది. అయితే అవసరం ఉన్న చోట బస్షెల్లర్లు మాత్రం లేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నార్సింగితో పాటు వల్లభాపూర్, నర్సంపల్లి, సేరిపల్లి, కాస్లాపూర్, మీర్జాపల్లి నుంచి ప్రతి రోజు చాల మంది పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువే. కాని ఇక్కడ కనీసం సరైన బస్షెల్టర్ను జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేయలేదని అంతా అంటున్నారు. సర్వీస్ రోడ్డులో దూరంగా రహదారికి ఇరువైపులా బస్షెల్టర్లను నిర్మించారు. అవి ఏమాత్రం ఉపయోగపడడంలేదని అంటున్నారు. ఆర్టీసీ ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్ బస్సులు జాతీయ రహదారిపై నుంచి వెళుతాయి. రోడ్డుపైనే ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. సర్వీసు రోడ్డులో ఉన్న ఈ బస్షెల్టర్లను బస్సులు ఆగే కూడళ్ల వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి బస్ షెల్టర్లను ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇక్కట్లు తొలగించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.