హైదరాబాద్
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పనిమాలిన స్టేట్ మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ‘ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ రావటానికి బీజేపీతో కుమ్మక్కు అయితే మరి నేషనల్ హెరాల్డ్ కేసులో 2015 డిసెంబర్ లో ED కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ బెయిల్ వచ్చింది. కాంగ్రెస్ కూడా ఎన్డీయే తో కుమ్మక్కు అయితేనే బెయిల్ వచ్చిందా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగమైన ఏఏపీ నేత మనీష్ సిసోడియా కు కూడా వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అంతేకాదు ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తు పెట్టాలకోవాలన్నారు. ఇవన్నీ కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయి. కనుక వీరంతా ఎన్డీయే భాగస్వాములేనని అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు.