YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధికారుల్లో హైడ్రా గుబులు...

అధికారుల్లో  హైడ్రా గుబులు...

హైదరాబాద్,  సెప్టెంబర్ 2 
హైడ్రా చాలా కట్టడాలను నేలమట్టం చేసింది. ఇందులో కొన్ని ఇళ్లున్నాయి.. మరికొన్ని ఆఫీస్‌లున్నాయి. కన్వెన్షన్లు ఉన్నాయి.. కొన్ని కాలేజీ గేట్లున్నాయి. కానీ.. అది ఎవరిదైనా.. ఎవరికైనా.. ఏది కూల్చినా నష్టమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి వాళ్లలా కట్టడాలు నిర్మించడానికి కారణం ఎవరు? పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? రోడ్లు వేసింది ఎవరు? కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అవే కట్టడాలకు నోటీసులు ఇచ్చింది ఎవరు? కూల్చింది ఎవరు?ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నోటీసులు అందుకున్న వారిలో మెజారిటీ ప్రజలు ఒకే ప్రశ్న వేస్తున్నారు. మేము ఇక్కడ ఇళ్లు, కార్యాలయాలు నిర్మించుకొని ఏళ్లు గడుస్తోంది. అన్ని డిపార్ట్‌మెంట్స్‌ నుంచి సరైన పద్ధతిలో పర్మిషన్స్ తీసుకున్నాం. అలా తీసుకున్నందుకే కదా కరెంట్ నుంచి నల్లా కనెక్షన్‌ వరకు అన్నీ ఇచ్చారు. మా కాలనీల్లో రోడ్లు కూడా వేశారు. మరి ఇన్నేళ్ల తర్వాత వచ్చి.. ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చేస్తామంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి చాలా బిల్డింగ్స్‌ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని నిర్మించారు. ఇప్పటికి కూడా వాటికి ఈఎంఐలు చెల్లిస్తున్నారు. మరి ఇప్పుడా బిల్డింగ్స్‌ కూలిస్తే వారు ఉండేది ఎక్కడ? వారి అప్పుల సంగతేంటి? అనేది ఓ అంతు చిక్కని ప్రశ్న. మరి ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేస్తుందా? లేదా?నిజానికి దీనికి అసలు కారణం ఈ కట్టడాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిదే. ఎందుకంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోతే అసలు కట్టడాలు కట్టేవారే కాదు. అప్పుడు కూల్చాలన్న ఆలోచనే ఉండదు కదా. మరి పర్మిషన్‌లు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా? అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కానీ అదొక్కటే సరిపోదు.. ఎందుకంటే ఈ కూల్చివేతల వల్ల నష్టపోయిన వారికి తగిన నష్టపరిహారం కూడా వారే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మరో అధికారి ఇలాంటి అనుమతులు ఇచ్చేందుకు వణికిపోతాడు.ఒక్క అధికారులు మాత్రమే కాదు.. యజమానులకు ఈ ప్లేస్‌లు కట్టబెట్టిన వెంచర్‌ ఓనర్లను కూడా బాధ్యులను చేయాలి. తప్పుడు పత్రాలు సృష్టించి.. అధికారులను మ్యానేజ్ చేసి అనుమతులు సాధించి వెంచర్లు వేశారు. ఆ తర్వాత లబ్ధిదారులకు అమ్మి సొమ్ము చేసుకొని నోట్ల కట్టలు జేబులో కుక్కుకొని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు తమకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. కాబట్టి.. వారిని కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాల్సిందే.వారి నుంచి కూడా డబ్బులను రికవరీ చేయాల్సిందే.ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. ఇలా కూల్చివేతల కారణంగా రోడ్డు మీద పడే వారి పరిస్థితి ఏంటి? అక్రమంగా నిర్మాణాలు చేసిన వారిని నిర్మోహమాటంగా పక్కన పెట్టండి. కానీ.. అన్ని అనుమతులు తీసుకొని ఇప్పుడు ఇరుక్కుపోయిన వారి పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.నిజానికి అక్రమంగా అనుమతిలిచ్చిన అధికారుల లిస్ట్ ఇప్పటికే ప్రిపేర్ అవుతోంది. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీయే, రిగేషన్, రెవెన్యూ, కొన్ని మున్సిపాలిటీల అధికారులది చాలా కీలకపాత్ర. ఎఫ్టీఎల్ , బఫర్‌ జోన్లలో నిర్మాణాలకు గతంలో ఎన్వోసీలు ఇచ్చారు. కొన్నింటికి నకిలీ ఎన్వోసీలు అని తెలిసి కూడా అనుమతులిచ్చారు. వీరిలో ప్రస్తుతం ఇంకా బాధ్యతలు నిర్వహిస్తున్నవారు ఉన్నారు.. రిటైర్ అయినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరందరి లిస్ట్ తయారు చేసి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.నిజానికి ఇప్పటికే కొంతమంది అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. బాచుపల్లి తహశీల్దార్ గా పనిచేసిన పూల్ సింగ్ చౌహాన్. నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేసిన రామకృష్ణారావు. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన సుధాంశు. ఇలా మొత్తం ఆరుగురిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు చేసిన ఘనకార్యాలు ఏంటంటే.. శిఖం భూమిని పట్టాభూమిగా చూపుతూ తప్పుడు నివేదికలు ఇవ్వడం. లే అవుట్ లకు అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం. చెరువు స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కోంటు రిపోర్ట్ ఇవ్వడం. ఇక చెరువు భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నా చూసి కూడా పట్టించుకోకపోవడం.. ఇలా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. నిజానికి ఇది మంచి చర్యే. అదే సమయంలో రోడ్డు మీద పడుతున్న వారి సంగతి కూడా ఆలోచిస్తే మరింత బాగుంటుంది.

Related Posts