హైదరాబాద్, సెప్టెంబర్ 3
టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనేక సమావేశాలు, చర్చల అనంతరం, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఈమధ్యే దీనిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లొచ్చారు. పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆశావహులు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉండి మంతనాలు జరుపుతున్నారు.టీపీసీసీ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ పదవి కోసం పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానికి పార్టీ నేతలతో అధిష్టానం అనేక చర్చలు జరిపింది. చివరకు మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈయన గత మూడేళ్లుగా పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి.తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్లను కాంగ్రెస్ నియమించనుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న దీపా దాస్ మున్షీకి వెస్ట్ బెంగాల్ పీసీసీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్గా చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ వచ్చే అవకాశం ఉంది. ఇక కేసీ వేణుగోపాల్కు కేరళ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నియామకాలపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
ఉక్కపోతలో సీనియర్లు
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు, కయ్యాలు, అసూయ, అణచివేత.. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. దేశానికి ఫ్రీడం సాధించిన పార్టీలో ఉన్న ఫ్రీడంతో నేతలు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తారు. అందుకే ఆ పార్టీలో కయ్యాలు నిరంతర ప్రక్రియ. పార్టీలో ఒక లీడర్ ఎదుగుదలను ప్రోత్సహించే వారికన్నా.. ఓర్వలేని నేతలే ఎక్కువగా ఉంటారు. అందుకే ఎదిగే నేతలు.. అనేక ఇబ్బందులు పడుతుంటారు. వాటిని అధిగమించిన వారే పార్టీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా నిలదొక్కుకుంటారు. లేదంటే రోషయ్యలా తప్పుకుంటారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు గుర్తింపు ఉంది. ఇది ఎవరూ కాదనలేదు. కానీ, ఇచ్చిన పార్టీకంటే ఉద్యమ పార్టీకే తెలంగాణ ప్రజలు రెండు ఎన్నికల్లో పట్టం కట్టారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారానికి దూరమైంది. టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డిని నియమించిన అధిష్టానం అతని సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అయింది. లోక్సభ ఎన్నికల్లోనూ 8 స్థానాలు సాధించింది. టీపీసీసీ చీఫ్గా రేవంత్కు పగ్గాలు అప్పగించినప్పుడు చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు. అసలైన కాంగెస్ వాదులు పేరిట గ్రూపు కట్టారు. డబ్బులు పెట్టి తెచ్చుకున్నారని ఆరోపించారు. కానీ, వాటిని అధిగమించుకుంటూ రేవంత్రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు.టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ అయ్యాక వేరు కుంపటి పెట్టిన సీనియర్లు క్రమంగా ఆయనను అణచివేయాలని చూశారు. పదవి నుంచి తప్పించాలని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అధిష్టానం ఫిక్స్ అయి ఉండడంతో వారి పప్పులు ఉడకలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులను తనకు అనుకూలంగా మలచుకున్నారు. అయితే కొందరు రేవంత్ ను కారణం చూపించి పార్టీని వీడారు. అలాంటి నేతల్లో మొదటి వరుసలో ఉంటారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఎవరు వెళ్లిపోయిన మొండికిపడి పార్టీకి ఊపు తీసుకు వచ్చి విజయతీరాలకు చేర్చిన నేత రేవంత్ రెడ్డి. మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిన తర్వాతనే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లుగా ఇతర నేతలు వచ్చి చేరారు. అలాంటి వారిలోనూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. పదవి తప్పితే ఆయనకు మరో రాజకీయం తెలియదు. అందు కోసమే కూర్చున్న కొమ్మను కూడా నరుక్కుంటాడు.తెలంగాణలో సీఎంగా రేవంత్రెడ్డి బలపడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి.. అందులో లీడర్ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి నచ్చడం లేదు. తన సామర్థ్యానికి మించిన పదవుల కోసం ఆశలు పడుతూ సొంత పార్టీలో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కావాలంటే.. ఆయన సోదరుడి పదవిని తీసేయాలి. పోనీ ఇద్దరికీ ఇవ్వాలంటే.. పార్టీకి ఆయన విధేయుడు కాదు. కొనఊపిరితో ఉన్న పార్టీ పీక నొక్కడానికి బీజేపీతో కలిసి మునుగోడు ఉపఎన్నిక తెచ్చిన తెచ్చిన ఘనుడు.ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. పథకాల అమలుతో పాటు.. హైడ్రా వంటి నిర్ణయాలతో ఆయన ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. మిగతా వారు ఆయనకు దూరంగా ఉండిపోతున్నారు. రేవంత్ కాకపోతే ఇంకెవరు అన్న ప్రశ్న వస్తే.. రేవంత్ లేకపోతే ఇంకెవరూ ఉండరన్న సమాధానం వస్తోంది. అందుకే లాబీయింగ్ లకు అలవాటుపడిన లీడర్లు.. కొత్తగా పుకార్లు రేపుకుంటున్నారు. ఉక్కపోతకు ఈ పుకార్ల ద్వారా స్వాంతన పొందుతున్నారు.