ఖమ్మం
కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్, కాలువొడ్డు బొక్కల గడ్డ లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల బృందం పర్యటించింది. నీట మునిగిన కాలనీలలోని ప్రజలు సర్వం కోల్పోయి మాటల్లో చెప్పలేని కష్టాల్లో వున్న బాధితులు తమ ఆవేదనను బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెప్పుకుంటూ వాపోయారు. హరీష్ రావు వరద ప్రాంతాల్లో బురదలో కాలి నడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. వారి కన్నీళ్లు చూసి చలించిపోయారు. కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లే ఈ ప్రభుత్వంలో లేరా అని బాధితులు అడుగుతుంటే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం పట్టించుకోలేదని, సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు వచ్చిన నేతలు తూతూ మంత్రంగా సహాయక చర్యలు చేపట్టినట్టు ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి వెళ్లిపోగానే వెళ్లిపోయారని, తమను ఎవరూ ఆదుకోలేదని ప్రజలు చెప్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డు మీద నిలుచున్నామని, తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బురదలో ఉండడానికి నీడ లేక చిన్నపిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావుతో, బీఆర్ఎస్ పార్టీ బృందంతో గోడు వెళ్లబోసుకున్నారు.…