YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ మౌనమే వ్యూహమా...

కేసీఆర్ మౌనమే వ్యూహమా...

హైదరాబాద్, సెప్టెంబర్ 5
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఇటీవల బయట కనిపించారు.  బయట అంటే.. ఆయన ఫామ్ హౌస్‌లోనే జైలు నుంచి వచ్చిన కుమార్తెకు స్వాగతం చెబుతూ కనిపించారు. ఆ దృశ్యాలు బయటకు వచ్చాయి. అప్పటి వరకూ దాదాపుగా రెండు నెలలు ఆయన బయట కనిపించకపోయే సరికి ఆరోగ్యం  బాగో లేదన్న పుకార్లు కూడా వచ్చాయి. కానీ కేసీఆర్ వేటినీ పట్టించుకోలేదు. బయటకు రాలేదు. కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన కార్యచరణ ఉంటుందని.. వెంటనే రైతుల కోసం టూర్ కి వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు లీక్ ఇచ్చాయి. కానీ అది లీక్ గానే మిగిలింది .ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇంతటి వరదలు వస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ కనీసం బయటకు వచ్చి కూడా చూడలేదని.. అలాంటి ప్రతిపక్షానికి తాము ఎలా సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కు పరిమితం అయితే.. ఆయన కుమారుడు అమెరికాలో జల్సా చేస్తున్నారని.. అక్కడ్నుంచి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్  ను రేవంత్ టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం దగ్గర్నుంచి కేసీఆర్ ఎందుకు  బయటకు రారని పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ బీఆర్ఎస్ వద్ద సరైన సమాధానమే లేకుండా పోయింది.అయితే రైతు రుణమాఫీ ఇతర అంశాలపై కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని.. రూట్ మ్యాప్ పై కసరత్తు కూడా చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వాతావరణం సాధారణంగా ఉంటే ఈ పాటికి ఆయన బస్సు తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతూ ఉండేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేవారని అంటున్నారు. వర్షం తగ్గిన తర్వాత మంచి రోజు చూసుకుని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని చెబుతున్నారు. అయితే ప్రజల్లోకి వెళ్లడానికి ఇంత కన్నా మంచి సందర్భం ఏమి ఉంటుందని.. ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడితే పార్టీకే మేలు కదా అని బీఆర్ఎస్ నేతల్లోనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో మౌనానిది కీలక పాత్ర. ఆయన కీలకమైన విషయాల్లో మౌనంగా ఉంటారు. సరైన సమయం చూసి ఎంటర్ అవుతారు. సిక్సర్ కొడతారు. అప్పటి వరకూ ఆయన చుట్టు ముసురుకున్న వ్యతిరేకత అంతా పాజిటివ్ గా మారుతుంది. రేవంత్ ప్రభుత్వానికి సమయం ఇచ్చేందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని.. ఇవాళ కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండి ఆయన ప్రజల్లోకి వస్తారని .. కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే మంచి అవకాశాల్ని కోల్పోతున్నామన్న భావన మాత్రం కొంత మంది బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.  కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌ అయితే పార్టీ పుంజుకునే అవకాశం ఉందని, అదే సమయంలో అనుకున్న సంఖ్యలో వలసలు లేకపోతే అనర్హత వేటు పడే ప్రమాదాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్‌ కూడా తనను కలిసిన ఎమ్మెల్యేలతో వలస వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయించడంతోపాటు కాంగ్రెస్‌ హామీలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. జంపింగ్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయడమే టార్గెట్‌గా పెట్టుకున్న బీఆర్ఎస్‌…. పార్టీ అధినేత రంగంలోకి దిగిన తర్వాత అనర్హత వేటు ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా పావులు కదుపుతోందంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫాం హౌస్‌లో ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్‌… తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని తాజాగా అంచనాకు వచ్చిన కేసీఆర్‌… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పునర్‌ వైభవం తెచ్చేందుకు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రైతు రుణమాఫీపై అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.రకరకాల నిబంధనలు విధించడం వల్ల.. 30 వేల కోట్లకుపైగా అవుతుందని అంచనా వేసిన రైతు రుణమాఫీ కేవలం 17 వేల కోట్లతో సరిపెట్టిందని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ విషయమై కృష్ణార్జునులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ ఇప్పటికే ఫైట్‌ చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి, ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాలని భావిస్తోంది బీఆర్ఎస్‌. ఇందుకోసం నేరుగా అధినేత రంగంలోకి దిగితే స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్‌ అయ్యే అవకాశం ఉందని ఊహిస్తోంది. కేసీఆర్‌ కూడా తగిన సమయం వరకు వేచి చూద్దామని ఇన్నాళ్లు ఆగారని.. ఇప్పుడు సమయం ఆసన్నమైనందున సమర శంఖం పూరించాలని డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు. వినాయక చవితి తర్వాత ఎప్పుడైనా, రైతు యాత్రలు ప్రారంభించేలా ప్లాన్‌ చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు.

Related Posts