YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందరిని కాదని మహేష్ గౌడే ఎందుకు...

అందరిని కాదని మహేష్ గౌడే ఎందుకు...

హైదరాబాద్, సెప్టెంబర్ 9,
ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. పార్టీలో పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ పదవికి పోటీపడినా చివరికి మహేశ్‌కుమార్‌గౌడ్ వైపే కాంగ్రెస్ హౌకమాండ్ మొగ్గు చూపింది. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవీ బాధ్యతలు దక్కించుకోవడంలో మహేష్‌కు కలిసి వచ్చిన అంశాలేంటి?తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నియమితులయ్యారు.  ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో విధేయతకే పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యమిచ్చి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2021 జులై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీ బాధ్యతల నుంచి తప్పించింది.బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన మహేష్‌కుమార్‌గౌడ్‌కి పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల అనంతరం 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2004 నుంచి 2014 మధ్యకాలంలో రెండు సార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సమయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్‌ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరవాత అదే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పార్టీపగ్గాలు అప్పగించడం విశేషం.గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడానికి మహేశ్‌కుమార్‌గౌడ్ టికెట్‌ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల వల్ల దక్కలేదు.  కేసీఆర్ పోటీలో ఉండటంతో రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో.. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆ స్థానం నుంచి తప్పుకొని నిజామాబాద్‌కు మారాల్సి వచ్చింది. దీంతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కోల్పోయారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఆయనను ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న మహేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనను పీసీసీ అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టిందంటున్నారు. ఈ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు పోటీపడ్డారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో.. పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. అందుకే రేవంత్‌రెడ్డి ఏరికోరి ఆయనకు పదవి ఇప్పించుకున్నట్లు చెప్తున్నారు.విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమన్వయంతో పనిచేసుకుంటూ విధేయుడిగా ఉంటారనే పేరు పొందడం మహేష్‌కు కలసి వచ్చింది … ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బలమైన వర్గంగా గుర్తింపు పొందిన గౌడ్ వర్గానికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.పీసీసీ చీఫ్‌ ఎంపిక అంకం ముగిసినందున.. రాష్ట్రంలో వరద పరిస్థితులు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని కాంగ్రెస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, మహేశ్‌‌కుమార్‌గౌడ్ కాంబినేషన్లో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
లోకల్ బాడీ సవాల్
స్థానిక సంస్థల ఎన్నికలే తన ముందున్న అతిపెద్ద సవాల్ అంటూ కుండబద్దలు కొట్టేశారు మహేష్ కుమార్ గౌడ్. సూటిగా సుత్తి లేకుండా తన టార్గెట్ ఏంటో ఫిక్స్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలే తన ముందున్న సవాల్ అని అన్నారు. తన పదవి కోసం పోటీ చేసిన వారితోనూ కలిసి ముందుకెళ్తానని, అందర్నీ సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లోనే టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటానని, ప్రభుత్వానికి, పార్టీకి వారధిగా ఉంటానని స్పష్టం చేశారు. త్వరలోనే కమిటీలను నియమిస్తామని, ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. గత పేదళ్లుగా పార్టీనే నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.

Related Posts