హైదరాబాద్, సెప్టెంబర్ 9,
వినాయక చవితి వచ్చిందంటే రాజధాని నగరంలో ఏ గల్లీ చూసినా వినాయక మంటపం కనిపిస్తుంది. నవరాత్రులు భక్తులు ఫుల్ హుషారుగా ఈ వేడుక చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ గణేషుడు అంటే వెంటనే ఖైరతాబాద్ విఘ్నేషుడు గుర్తుకు వస్తాడు. ఈ నవరాత్రుల్లో కనీసం 30 నుంచి 40 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తుతోపాటు భక్తులకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ డైవర్షన్లు కూడా చేస్తుంటారు. ఈ సారి కూడా ఖైరతాబాద్ గణేషుడి మంటపం చుట్టూ పలు మార్గాలను వాహనదారులకు మూసేశారు. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. ఈ మార్పులు పది రోజులపాటు అంటే వినాయక మహానిమజ్జనం వరకు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేట్ దాటి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వైపునకు వచ్చే దారిలో వాహనాలకు అనుమతి లేదు. సచివాలయం వెనుక వైపున మింట్ కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వైపునకు అనుమతి లేదు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వద్దకు గల దారిని కూడా వాహనాలకు మూసేస్తారు. రాజ్ దూత్ లేన్ నుంచి ఖైరతాబాద్ విగ్రహం వద్దకు వచ్చే దారిలో కూడా వాహనాలకు అనుమతి లేదు. నెక్లెస్ రోటరీ నుంచి ఐమాక్స్, సైఫాబాద్ పోలీసు స్టేషన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే దారిలో కూడా వాహనాలను అనుమతించరు.ఈ దారులకు ప్రత్యామ్నా మార్గాలను కూడా ట్రాఫిక్ అధికారులు సూచించారు. మింట్ కాంపౌండ్ వైపు నుంచి ఖైరతాబాద్కు వెళ్లే వారు.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింది నుంచి సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ గార్డెన్.. రోటరీ నెక్లెస్.. ఆ తర్వాత ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ ఎక్కేసి వెళ్లిపోవచ్చు. అలాగే.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు నుంచి ఇక్బాల్ మినార్.. అక్కడి నుంచి సైఫాబాద్ ఓల్డ్ పీఎస్.. అక్కడి నుంచి నిరంకారి నుంచి నేరుగా ఖైరతాబాద్ జంక్షన్కు వెళ్లవచ్చు.ఖైరతాబాద్ మహా గణేషుడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వాహనాలను పార్క్ చేసుకోవడానికి కూడా కొన్ని పార్కింగ్ ప్లేస్లను అధికారులు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ సమీపంలో ఐమాక్స్ పక్కనున్న అంబేద్కర్ స్క్వేర్లో తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ఐమాక్స్కు ఎదురుగా, ఎన్టీఆర్ గార్డెన్, సరస్వతి విద్యా మందిర్, రేస్ కోర్స్ రోడ్.. ఈ ఏరియాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు.వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగా వైభవంగా చేస్తున్నారు. ఊరూవాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. వరుణుడి కాస్త శాంతించటంతో చాలాచోట్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. భారీ వినాయకున్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులు సెలవు రావటంతో ఎక్కువ మంది భక్తులు తరలివచ్చారు. ఇంకోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.