ఖమ్మం
భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరుద్ధరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవలి విపత్తు వల్ల అన్ని శాఖలు కలిపి రూ. 729.68 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. సమీక్ష లో శాఖల వారిగా శాశ్వత పునరుద్ధరణ, తాత్కాలిక మరమ్మత్తులకు అయ్యే ఖర్చుపై మంత్రి సమీక్షించారు.యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు మరుసటిరోజే చేపట్టినట్టు, వ్యవసాయ విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. రోడ్డు, కల్వర్టు ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంట నష్టం సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నీటి వనరుల మరమ్మత్తుల్లో వేగం పెంచాలన్నారు. ముంపు ప్రాంతాల వారికి త్రాగునీటి సరఫరా చేపట్టినట్లు ఆయన అన్నారు. అన్ని శాఖలు సమన్వయం తో పనిచేసి, ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. ప్రభుత్వం నుండి నష్టపరిహారం వారి వారి ఖాతాల్లో జమకు చర్యలు చేపట్టామన్నారు. పంట నష్టం సర్వే పూర్తి కాగానే, రైతుల ఖాతాల్లో ఎకరాకు 10 వేల చొప్పున జమచేస్తామన్నారు. నష్టపోయిన ప్రతిఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు.