YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

111 ఎకరాలు... 262 అక్రమ నిర్మాణాలు హై స్పీడ్ లో హైడ్రా

111 ఎకరాలు... 262 అక్రమ నిర్మాణాలు  హై స్పీడ్ లో  హైడ్రా

హైదరాబాద్, సెప్టెంబర్ 12,
అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న హైడ్రా ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. మొత్తం 23 ప్రాంతాల్లో ఈ కూల్చివేతలను చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి  సమర్పించిన నివేదికలో పేర్కొంది. చెరువులు, నాలాలు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో గత రెండు నెలలుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తూ వస్తోంది. జంట నగరాల్లో హైడ్రా హాట్ టాపిక్‌గా మారింది.
 హైడ్రా కూల్చివేతల జాబితా:
✦ అత్యధికంగా అమీన్‌పూర్‌ చెరువు పరిధిలో 51 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
✦ మాదాపూర్‌ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
✦ దుండిగల్‌ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా తెలిపింది.
✦ ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్‌‌లో మణెమ్మ గల్లీలో నాలాపై 3 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
✦ మాదాపూర్‌ సున్నం చెరువులో 42, అమీన్‌పూర్‌ పెద్ద చెరువు పరిధిలో 24, గగన్‌ పహాడ్‌ అప్పా చెరువులో 14 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందజేసింది.
హైడ్రా కూల్చివేతల్లో కొన్ని పేదలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువుల్లో 11 వేల మంది పేదలకు ఇళ్లు ఉన్నాయని.. వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై రీ-సర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేత చర్యలు చేపట్టనుంది. కొన్నేళ్లుగా శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా స్పష్టం చేసింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కొత్తగా నిర్మించే ఇళ్లు, భవనాలను కూల్చివేస్తామని ప్రకటించింది. బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేందుకూ సిద్ధమైంది.హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను హైడ్రాకు కేటాయించింది. వీరందరూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు. హైడ్రా చర్యలు వేగవంతం కానున్నాయని చెప్పేందుకు ఈ నిర్ణయం కూడా బలోపేతం చేస్తోంది.మరోవైపు.. హైడ్రా కూల్చివేతల అంశంపై దుమారం రేగుతుండగా, ఈ వ్యవస్థకు బలం చేకూరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాళ్లలో ఎంతటి మహామహులు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా టాస్కే చెరువులను, నాలాలను సంరక్షించడం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో హైడ్రా రానున్న రోజుల్లో మరింత దూకుడుగా కూల్చివేతల చర్యలను చేపట్టనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇదిలా ఉండగా.. హెచ్ఎండీఏ వెబ్‌సైట్ సర్వర్‌పై ఓవర్ లోడ్ కారణంగా  సేవలకు అంతరాయం కలిగింది. ఉదయం నుంచి ఓవర్ లోడ్ సమస్యతో హెచ్ఎండీఏ ఆన్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. డేటా ఓవర్ లోడ్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోర్ చేసే ప్రయత్నాలు చేపట్టారు. సేవలను అతి త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

Related Posts