YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోవర్టు అధికారులు గుర్రుగా రేవంత్ సర్కార్

కోవర్టు అధికారులు గుర్రుగా రేవంత్ సర్కార్

హైదరాబాద్, సెప్టెంబర్ 26,
సాధారణంగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి అంతర్గతంగా జరిగే విషయాలు రహస్యంగా ఉంటాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. అంతర్గత విషయాలు బహిర్గతమవుతున్నాయి. కేబినెట్ నిర్ణయాలు వెంటనే తెలిసిపోతున్నాయి. పథకాల సంబంధించిన సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలు బయటకు చేరిపోతున్నాయి.. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం పూర్తికావడమే ఆలస్యం.. ఆ సమాచారం మొత్తం గులాబీ నేతలకు తెలిసిపోతుంది. దీంతో గులాబీ నాయకులు వెంటనే తమ వాయిస్ వినిపిస్తున్నారు.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీరిగ్గా ఇన్ని రోజులకు “గులాబీ” బ్యూరోక్రాట్లపై నజర్ పెట్టిందని తెలుస్తోంది. కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదని.. ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంతమంది మంత్రులు వివిధ అంశాలపై కీలక అధికారులతో చర్చించారు. అయితే ఆ విషయం కూడా భారత రాష్ట్ర సంత నేతలకు తెలిసింది.. దీంతో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మంత్రులు నిర్వహించిన సమావేశం వివరాలను కూడా వారు వెల్లడించారు. దీంతో ఆ మంత్రులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఫలితంగా వారు ఆ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఎన్నిసార్లు సదరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అయితే కీలకమైన సమాచారాన్ని బ్యూరోక్రాట్లు ఎందుకు గులాబీ నేతలకు చేరవేరుస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ నాయకులతో ఎందుకు అంత సన్నిహితంగా ఉంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినప్పటికీ.. ఎందుకు బ్యూరోక్రాట్లు సర్కార్ కు దగ్గర కాలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి కూడా అధికారుల మనసులు ఎందుకు గెలవలేక పోతున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గులాబీ నేతలతో అధికారులు సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే ఇటీవల ఏసీబీ దాడులు పెరిగిపోవడం.. కొందరు అధికారులను ప్రభుత్వం లూప్ లైన్లోకి పంపించడం.. కోరుకున్న చోటుకు బదిలీలు చేయకపోవడం.. వంటి కారణాలవల్ల బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నట్టు తెలియవస్తోంది. మరి ఈ సమస్యకు రేవంత్ రెడ్డి ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సి ఉంది. ” ప్రభుత్వ అంతర్గత సమాచారం ఎప్పటికప్పుడు భారత రాష్ట్ర సమితికి చేరిపోతోంది. దీనివల్ల ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ సమస్యను రేవంత్ ఇప్పటికే పరిష్కరించారని.. మిగిలిన వారిని కూడా సెట్ రైట్ చేస్తే ఇబ్బంది ఉండదని” కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కేటీఆర్ డిమాండ్స్.... సాయంత్రానికి సర్కార్ జీవోలు
కొంత కాలంగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రెస్మీట్లలో చేసిన డిమాండ్లు.. సాయంత్రానికి సర్కారు ఉత్తర్వులుగా వెలువడడం కనిపిస్తున్నది. దీనిని బట్టి చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల్లో ఇంకా గులాబీ కోవర్టులు ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి నిర్వహించబో్యే సమీక్షలు, అందులోని అంశాలు ముందుగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలకు తెలిసిపోతున్నాయన్న సందేహాలు కలుగుతున్నాయి.తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టారు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి ఇండ్లను హైడ్రా కూల్చుతున్నదని, పెద్దల ఇండ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టిన 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని హైడ్రా బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి దిక్కు లేని నిరుపేదలే నాలాల పైన నిర్మాణాలు కట్టుకుంటారని, అలాంటి వారిని గుర్తించి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే వారి నిర్మాణాలు తొలగించాలని కోరారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
మూసీ పరీవాహక ప్రాంత బఫర్ జోన్లో ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయం చూపి నది పరీవాహకంలో నిర్మాణాలను తొలగించాలని సూచించారు. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల ఆక్రమణ వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని, వాటి పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం ముగిశాక సాయంత్రం మూసీ పరీవాహక నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఉదయం కేటీఆర్ విలేకరుల సమావేశం పెట్టడం, హైడ్రా బాధితుల సమస్యలను ప్రస్తావించడం, బీఆర్ఎస్ నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇదే క్రమంలో ప్రభుత్వం సాయంత్రమే మూసీ పరీవాహక నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కావడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి.వివిధ శాఖల్లోని ఉన్నత అధికారులు ప్రభుత్వం నిర్వహించే సమీక్షలపై ముందే బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఉప్పందిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ అంశాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే విషయాలు ముందుగానే ప్రతిపక్ష పార్టీ పెద్దలకు చేరుతున్నట్టు సందేహాలు వస్తున్నాయి. మంగళవారం నిర్వహించే సమీక్ష వివరాలు సైతం బీఆర్ఎస్ ముఖ్య నేతలకు తెలియడం వల్లే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో తీసుకోబోయే నిర్ణయాలకు తగినట్టుగా మాట్లాడారనే సందేహాలు కలుగుతున్నయి. ఇప్పటికీ గత ప్రభుత్వంతో కలిసి పని చేసిన అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారని, ప్రభుత్వం పెద్దల హెచ్చరిలకు బేఖాతరు చేస్తూ ఇంటర్నల్ విషయాలను లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.అదీగాక గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాలు, సమీక్షల తీరు, పాలకుల ఆలోచనలు ఉన్నతంగా ఉండేవని, వారిని ఆదర్శంగా తీసుకున్న అధికార పెద్దలు కొందరు ఇప్పటికీ వారికి బంట్లుగా పనిచేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ముందుగానే ప్రతిపక్షానికి తెలుస్తుండడం, వివిధ శాఖల్లో బీఆర్ఎస్ దోస్తులు ఉన్నట్టు తెలుస్తుండడం అధికార పార్టీకి మింగుడుపడని వ్యవహారంలా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts